Weather Update : డేంజర్ బెల్స్.. బయటకు రాకండి.. రాబోయే రెండు నెలలు జాగ్రత్త..! సంచలన నివేదిక .. బాబోయ్ మంటలే..
Weather Update : దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45డిగ్రీలు కూడా దాటిపోతాయని, దేశం ఎదుర్కొనే అత్యంత తీవ్రమైన వేసవిలో ఈ ఏడాదీ ఒకటి కావొచ్చునని అంచనా వేశారు.
Weather Update
- రాబోయే రెండు నెలలు అత్యధిక ఉష్ణోగ్రతలు
- 45డిగ్రీలు దాటనున్న ఉష్ణోగ్రతలు, వడగాల్పులు
- వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ
Weather Update : ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఎండలకు తోడు ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా మధ్యాహ్నం సమయాల్లో ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు బయటకు రావొద్దని, అత్యవసర పరిస్థితుల్లో బయటకు వస్తే ఎండ నుంచి రక్షణగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే, తాజాగా.. మరో కీలక అప్డేట్ వచ్చింది. పలు విదేశీ వాతావరణ సంస్థలు సంచలన విషయాలను వెల్లడించాయి.
భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం 40 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే, రాబోయే రోజుల్లో 45డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, మే, జూన్ నెలల్లో ఎండలు మరింత తీవ్ర మవుతాయని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రధానంగా విదేశీ వాతావరణ సంస్థల మోడళ్లు అంచనా ప్రకారం.. భారత దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు కూడా దాటిపోతాయని, దేశం ఎదుర్కొనే అత్యంత తీవ్రమైన వేసవిలో ఈ ఏడాదీ ఒకటి కావొచ్చునని అంచనా వేశారు. వాతావరణ అనిశ్చితితో వర్సాలు కురిస్తే తప్ప వేడి నుంచి ఉపశమనం లభించడం కష్టమేనని అంటున్నారు.
వచ్చే రెండు వారాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని పలు వాతావరణ మోడళ్లు అంచనా వేస్తున్నాయి. ఈ సీజన్లో ఉత్తరాదిలో ఉన్న అధిక పీడనం ప్రభావంతో ఉత్తర, మధ్య భారతంలో ఉన్న వేడిగాలులు దక్షిణాది రాష్ట్రాలపైకి వీస్తున్నాయని ఇస్రో వాతావరణ నిపుణుడు తెలిపారు.
ఇదిలాఉంటే ఏపీలోనూ ఎండలు తీవ్రత పెరిగింది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం నంద్యాల జిల్లాలోని సంజమాలలో 45డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కడప జిల్లాలోని ఒంటిమిట్టలో 44.9డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే కాలంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
శుక్రవారం కూడా ఏపీలోని పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. మన్యం, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో గరిష్ఠంగా 43డిగ్రీల నుంచి 44.5డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు మధ్యాహ్నం వేళల్లో బయటకు రావొద్దని హెచ్చరించింది. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చినా ఎండ వేడిమి నుంచి రక్షణ చర్యలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
మరోవైపు… ఇవాళ మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి, పోలవరం జిల్లాల్లోని సుమారు 30 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 55 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
