Pawan Kalyan: భద్రాచలంకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రేపు సాయంత్రం వరకు అక్కడే.. పూర్తి షెడ్యూల్ ఇలా
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలంకు వెళ్లనున్నారు.
- Harishth Thanniru
- Updated on- April 5, 2025 / 09:04 AM IST
Pawan Kalyan
Pawan Kalyan: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ (ఏప్రిల్ 5న) తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలంకు వెళ్లనున్నారు. రేపు శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో సీతారాములవారి కల్యాణోత్సవం అంగరంగవైభవంగా జరుగుతుంది. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే, భద్రాచలంలో జరిగే శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొనేందుకు ఒక్కరోజు ముందుగానే పవన్ కల్యాణ్ భద్రాచలంకు వెళ్లనున్నారు.
భద్రాద్రి రామయ్య కళ్యాణానికి ఏపీ ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలను పవన్ కల్యాణ్ అందజేయనున్నారు. ఈ మేరకు మధ్యాహ్నం 12గంటల సమయంలో పవన్ కల్యాణ్ హైదరాబాద్ లోని మాదాపూర్ నుంచి రోడ్డు మార్గంలో ఖమ్మం జిల్లాకు వెళ్తారు. ఖమ్మం జిల్లా మీదుగా సాయంత్రం 5గంటలకు భద్రాచలంకు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు.
శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా భద్రాద్రిలో జరిగే సీతారాములవారి కల్యాణోత్సవంలో పవన్ కల్యాణ్ పాల్గొని ఏపీ ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. ఆదివారం సాయంత్రం 5గంటల సమయంలో భద్రాచలం నుంచి బయలుదేరి రాత్రి 10గంటలకు తిరిగి మాదాపూర్ లోని తన నివాసానికి పవన్ కల్యాణ్ చేరుకుంటారు. మరోవైపు సీతారాముల వారి కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు ఇతర మంత్రులు భద్రాచలం వస్తుడటంతో అధికారులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
pawan kalyan bhadrachalam tour schedule
