దిలీప్ కుమార్ సడన్ ఎంట్రీకి రీజన్ ఏంటి.. ఎమ్మెల్సీగా గెలుస్తారా.. ?

దిలీప్ కుమార్ సడన్ ఎంట్రీకి రీజన్ ఏంటి..  ఎమ్మెల్సీగా గెలుస్తారా.. ?

Updated On : August 29, 2020 / 7:34 PM IST

తెలంగాణలో గ‌త కొంత కాలంగా సైలెంట్‌గా ఉన్న కపిలవాయి దిలీప్‌కుమార్‌ సడన్‌గా క‌రోనా టైంలో తెర‌పై దర్శనమిచ్చారు. రెండుసార్లు ఎమ్మెల్సీగా పని చేసిన ఆయన.. పని చేయని పార్టీ అంటూ లేదు. దాదాపు రెండేళ్లు సైలెంట్‌గా ఉన్న ఆయన ఒక్కసారిగా మీడియా ముందుకు వ‌చ్చారు. ఏంటి సార్ చాలా కాలం కనిపించకుండా పోయి.. ఒక్కసారిగా హ‌డావుడి మొదలుపెట్టారేంటని అడిగితే సింపుల్‌గా సమాధానం చెప్పేశారు.

క‌రోనా విష‌యంలో తెలంగాణ ప్రభుత్వం స‌రిగా ప‌ని చేయ‌డం లేదు. అందుకే ప్రజ‌ల‌ను ఎడ్యుకేట్ చేయడానికి వచ్చానంటూ ఒక స‌ద‌స్సు పెట్టేశారు. అసలైన కారణం అది కాదని అంటున్నారు బాగా దగ్గరగా గమనించిన వారు.

రాజ‌కీయ నాయ‌కుల సేవాభావం అందరికీ తెలిసిందే. అస‌లు విష‌యం ఏంటని దిలీప్‌కుమార్‌ను అడిగితే.. రెస్పాన్స్‌ ఇవ్వలేదు. తెలంగాణ‌లో సాధారణ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల కాలం ఉంది. తొందర్లోనే పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎమ్మెల్సీ ఎన్నిక‌లు రాబోతున్నాయి. ఆయనేమో ఆల్రెడీ రెండు ప‌ర్యాయాలు వ‌రంగ‌ల్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.

ఈసారి కూడా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోవాల‌ని చూస్తున్నార‌ట‌. చాలా పార్టీలను తిరిగొచ్చిన ఆయన.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రీయ లోక్ ద‌ళ్ పార్టీలో ఉన్నారు. ఈ పార్టీకి తెలంగాణ‌లో పెద్దగా బ‌లం లేదు. కాబట్టి ఏదో ఒకటి చేయాలి కదా.. అందుకే విప‌క్షాల మ‌ద్దతు కూడ‌గ‌ట్టేందు అఖిల‌ప‌క్షం స్టార్ట్ చేశారు. అందుకోసం క‌రోనా అవ‌గాహ‌న‌ అంటూ అడుగు ముందుకేశార‌ట‌.

టీఆర్ఎస్‌ నుంచి రెండుసార్లు ఎమ్మెల్సీగా ఎన్నికైన దిలీప్‌కుమార్‌.. ఆ తర్వాత ఆ పార్టీని వీడి.. తెలంగాణ విమోచన సమితి అనే పార్టీ పెట్టేశారు. అక్కడితో ఆగకుండా విమలక్క, గద్దర్‌ లాంటి వారితో కలిసి టీయుఎఫ్‌ను మొదలుపెట్టారు. అది కూడా వర్కువుట్‌ అవ్వలేదు. 2014 ఎన్నికల్లో అజిత్‌సింగ్‌ నేతృత్వంలోని టీఆర్ఎల్‌డీలో చేరారు.

అక్కడా లాభం లేదనుకొని కేంద్రంలో బీజేపీ బలంగా ఉంది కాబట్టి అదైతే బెటర్‌ అనుకున్నారేమో.. దత్తాత్రేయకు దగ్గరై కాషాయం కండువా కప్పుకున్నారు. అబ్బే.. అక్కడ కూడా కలసి రాకపోవడంతో మన మాజీ ప్రొఫెసర్‌ కోదంరాం పార్టీ తెలంగాణ జన సమితిలో చేరారు. మొన్నటి ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ వెంటనే మళ్లీ టీఆర్ఎల్‌డీలోకి వచ్చేసి.. ఇప్పుడు ఎమ్మెల్సీగా మరోసారి ట్రై చేయబోతున్నారట. మరి ఆయన అనుకుంటున్నట్టుగా ఎమ్మెల్సీగా గెలిచే చాన్స్‌ ఉందా.. జనాలు లైట్‌గా తీసుకుంటారా? చూడాల్సిందే.