Kishan Reddy : ధాన్యం కొనుగోలు విసయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు బీజేపీ కార్యాచరణ చేపట్టింది. కల్లాల్లో ఉన్న ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, సన్నాలతోపాటు.. దొడ్డు రకానికికూడా రూ. 500 బోనస్ ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఈ క్రమంలో ‘కల్లాల వద్దకు బీజేపీ’ పేరుతో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లి బీజేపీ నేతలు పరిశీలించనున్నారు. గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బీబీనగర్ మండలం రాఘవాపురం, రుద్రవెల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : ACP Uma Maheswara Rao : బాబోయ్ అక్రమాస్తులు అన్నికోట్లా..! బయటపడుతున్న ఉమామహేశ్వరరావు అక్రమ భాగోతాలు
రైతులు పండిన వరి ధాన్యంను 45రోజుల క్రితం కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకువచ్చిన పట్టించుకోనే నాథుడు లేడు. బస్తాలు కుట్టే దారం నుండి మొదలుకొని వరి ధాన్యం కొనుగోలుకు అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. రైతుల నుండి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఇబ్బంది అంటూ కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల వద్దఉన్న చివరి ధాన్యం గింజనుసైతం కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కిషన్ రెడ్డి అన్నారు. ఎంఎస్పీకి అనుగుణంగా ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంఎస్పీ 66 శాతం పెంచామని కిషన్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలకు హామీ ఇచ్చింది. అందులో ఒకటి రైతులు. వారు చేతి గుర్తుకు ఓటు వేసినందుకు చేయిచ్చే పరిస్థితి వచ్చింది.
ఎన్నికల్లో మీనేత సోనియా గాంధీ నేను సోనియమ్మను అంటూ ప్రచారం చేసింది కదా.. సోనియాగాంధీ సంతకంతోటి గ్యారంటీలకు హామీ ఇచ్చారు కదా.. ఇదే నా సోనియమ్మ రాజ్యం అంటే అని కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ధాన్యం సేకరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది. డిసెంబర్ 9నే రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. వంద రోజుల్లో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఇప్పటికి పూర్తి కాలేదు. బ్యాంకులో రైతులకు రుణాలు ఇవ్వడం లేదని కిషన్ రెడ్డి అన్నారు. వరికి 500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు సన్నవడ్లకు మాత్రమే ఇస్తామని అంటున్నారు. సన్నరకం పేరు మీద దొడ్డు రకం రైతులను అన్యాయం చేస్తే బీజేపీ వదిలిపెట్టదని రాష్ట్ర ప్రభుత్వాన్ని కిషన్ రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలల కాలంలోనే రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైతుల కళ్ళల్లో నీరు కాదు.. రక్తం వస్తుందంటూ కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వంపై బీజేపీ పోరాటం చేస్తుందని చెప్పారు.