ఇక న్యాయపోరాటమే అంటున్న గులాబీ టీమ్..! వీరికి లీగల్ నోటీసులు

లేటెస్ట్‌గా ఫోన్ ట్యాపింగ్ అంశంపై మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో జరిగే ప్రచారంపై కేటీఆర్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

KTR

రాజకీయాల్లో విమర్శ, ప్రతి విమర్శ సహజమే. ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకోవడం కూడా పాలిటిక్స్‌లో కామనే. కానీ వ్యక్తిగత విమర్శలకు వచ్చేసరికి లీడర్లు కూడా హర్ట్ అవుతున్న పరిస్థితి. వ్యక్తిగత విమర్శలు, హద్దులు దాటి తిట్ట పురాణం కొన్ని రోజులుగా బాగా పెరిగిపోతోంది. ఈ క్రమంలో తనపై అడ్డగోలుగా.. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నవారిపై ఇకపై సీరియస్‌ యాక్షన్‌ తీసుకుంటానని చెప్పకనే చెప్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నవారిపై ఇంకాస్త స్ట్రాంగ్‌గా లీగల్ ఫైట్‌ చేయాలని డిసైడ్ అయ్యారట. ముందు నుంచి తనపై అసత్య ఆరోపణలు చేస్తున్న వారి విషయంలో కేటీఆర్ సీరియస్‌గానే ఉంటూ వస్తున్నారు. మంత్రి కొండా సురేఖ మీద కేటీఆర్ దాఖ‌లు చేసిన ప‌రువు న‌ష్టం దావాపై ఇప్పటికే విచారణ జరుగుతోంది. ఈ కేసులో కొండా సురేఖ నాంపల్లి క్రిమినల్ కోర్టుకు హాజరై వివరణ కూడా ఇచ్చుకున్నారు.

Also Read: లిక్కర్‌ ముడుపుల జప్తు.. టార్గెట్ పెద్దతలకాయేనా!? స్కాం కేసులో తెరపైకి కొత్త పేర్లు..

ఇక ఫోన్ ట్యాపింగ్ అంశంలో తనపై అసత్య ఆరోపణలు చేశారంటూ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్‌ కేకే మహేందర్ రెడ్డికి గతంలో లీగల్ నోటీసులు పంపారు కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్‌లో ఏ ప్రమేయం లేకున్నా ఈ నేతలంతా తనను బద్నాం చేసేలా మాట్లాడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ నేతల ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్న కేటీఆర్.. తనపై ఆధారాల్లేని ఆరోపణలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలకు తాను రెడీ అవుతున్నానని లీగల్ నోటీసుల్లో పంపారు.

చాలా సీరియస్‌గా రియాక్ట్ అవుతున్న కేటీఆర్
కేంద్రమంత్రి బండి సంజయ్‌కి కూడా కేటీఆర్ లీగల్ నోటీసు పంపిన సందర్భం ఉంది. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ వ్యవహారంలో తనపై నిరాధారమైన..తన పరువుకు నష్టం కలిగేంచేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆయనకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. తనపై చేసిన నిరాధారమైన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని లీగల్ నోటీసుల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు.

ఫోన్ ట్యాపింగ్ పేరుతో పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ చేసిన ఆరోపణలపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ ఇష్యూలో తనపై అసత్య ఆరోపణలు చేశారంటూ మహేశ్‌ కుమార్ గౌడ్‌కు లీగల్ నోటీసులు పంపించారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా తమపై, పార్టీ నేతలపై దిగజారుడు వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అసత్య ఆరోపణలపై బేషరతుగా మహేశ్‌కుమార్ గౌడ్‌ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

ఇలా తనపై అసత్య ఆరోపణలు చేయడం, ఆధారాలు లేని అంశాలను లేవనెత్తడంపై కేటీఆర్ చాలా సీరియస్‌గా రియాక్ట్ అవుతున్నారు. లేటెస్ట్‌గా ఫోన్ ట్యాపింగ్ అంశంపై మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో జరిగే ప్రచారంపై కేటీఆర్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అడ్డగోలుగా థంబ్‌నెయిల్స్ పెడుతూ..తన ఫోటోలు పెట్టి ఎలా పడితే అలా ఆరోపణలు చేస్తున్నవారిపై లీగల్‌ యాక్షన్‌ తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇకపై ఎవరు తనపై అసత్య ఆరోపణలు చేసినా వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నారట కేటీఆర్. తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించేవారిపై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేకంగా లీగల్ టీంను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది.