Uttam Kumar Reddy: పార్టీ మార్పు విషయంపై క్లారిటీ ఇచ్చిన ఉత్తమ్.. ఆ రెండు నియోజక వర్గాలు మావేనంటూ వెల్లడి
కాంగ్రెస్ పార్టీ వీడుతున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి ఖండించారు.

Uttam Kumar Reddy
Congress MP Uttam Kumar Reddy: కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ పార్టీని వీడుతున్నారంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. పలుసార్లు ఉత్తమ్ ఈ ప్రచారాన్ని ఖండించారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీ ఉత్తమ్కు ఆఫర్ ఇచ్చినట్లు, ఆయన త్వరలో బీఆర్ఎస్లో చేరబోతున్నట్లు మరోసారి విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ వీడుతున్నట్లు వస్తున్న వార్తలను ఎంపీ ఉత్తమ్ కుమార్రెడ్డి మరోసారి ఖండించారు. ఈ మేరకు ఒక వీడియోను మీడియాకు ఉత్తమ్ విడుదల చేశారు.
తాను కాంగ్రెస్లోనే కొనసాగుతానని పార్టీ మారే ఆలోచన లేదంటూ ఉత్తమ్ ఈ వీడియోలో స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో నేను హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి, నా భార్య పద్మావతి కోదాడ నియోజకవర్గం నుంచి బరిలో ఉండనున్నట్లు స్పష్టం చేశారు. మా జీవితం హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గ ప్రజలకు అంకితమంటూ ఉత్తమ్ మీడియాకు విడుదల చేసిన వీడియోలో స్పష్టం చేశారు.
ఇదిలాఉంటే.. గాంధీ భవన్లో శనివారం టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టికెట్ వస్తేనే పనిచేస్తామనడం సరికాదని, ఆశావాహులంతా ప్రజల్లో తిరగాలని అన్నారు. తెలంగాణలో బీజేపీ పోటీలోనే లేదని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటడం ఖాయం అని తెలిపారు. కాంగ్రెస్కు 70 సీట్లు వస్తాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.