Ram Mohan Goud: హైదరాబాద్లోని ఎల్బీనగర్ బీఆర్ఎస్ కీలక నేత రామ్మోహన్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇవాళ ఆయనకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం రామ్మోహన్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. గతంలో కాంగ్రెస్లో పని చేసిన అనుభవం తనకు ఉందని చెప్పారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అంటే తనకు ఎంతో అభిమానమని తెలిపారు. ఎల్బీనగర్ నుంచి వరుసగా రెండుసార్లు ఓడిపోయినా నిత్యం ప్రజలతో మమేకం అవుతూ వచ్చానని చెప్పారు.
ఈ నియోజక వర్గ సమస్యలపై పూర్తి అవగాహన ఉందని తెలిపారు. అందరం కలిసి ఎల్బీనగర్లో కాంగ్రెస్ ను గెలిపించుకుందామని చెప్పారు. కాగా, కొన్ని రోజులుగా నుంచి తన అనుచరులు, మద్దతుదారులతో రామ్మోహన్ గౌడ్ చర్చించారు.
పార్టీ మారే విషయంపై తుది నిర్ణయం తీసుకుని, కాంగ్రెస్ నేతలతోనూ సంప్రదింపులు జరిపారు. ఎల్బీనగర్ నుంచి గత ఎన్నికల్లో సుధీర్ రెడ్డి గెలిచారు. ఈ సారి బీఆర్ఎస్ ఆయననే ఎన్నికల పోటీకి దింపుతోంది. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసుకుంటోంది. తొలి విడత జాబితా త్వరలోనే విడుదల చేయనుంది.
Bandaru Satyanarayana : హైకోర్టులో బండారు సత్యనారాయణ పిటిషన్పై విచారణ, పోలీసులకు కీలక ఆదేశాలు