Moinabad Farm House Case: మొయినాబాద్ ఫామ్హౌస్ కేసులో కీలక పరిణామం.. టీడీపీ ఎంపీకి స్టేషన్ బెయిల్
రేపు పార్లమెంటు సమావేశాలు ఉన్న నేపథ్యంలో పుట్టా మహేశ్ యాదవ్ కు స్టేషన్ బెయిల్ ఇచ్చారు పోలీసులు.
Representative Image (Image Credit To Original Source)
- మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ కు బెయిల్
- రేపు పార్లమెంటు సమావేశాలు ఉన్న నేపథ్యంలో స్టేషన్ బెయిల్ మంజూరు
- ప్రియాంక రెడ్డికి కూడా బెయిల్ ఇచ్చిన పోలీసులు
Moinabad Farm House Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏపీ టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ కు స్టేషన్ బెయిల్ లభించింది. పుట్టా మహేశ్ యాదవ్ కి అధికారులు స్టేషన్ బెయిల్ ఇచ్చారు. పుట్టాతో పాటు ప్రియాంక రెడ్డికి స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు. రేపు పార్లమెంటు సమావేశాలు ఉన్న నేపథ్యంలో పుట్టా మహేశ్ యాదవ్ కు స్టేషన్ బెయిల్ ఇచ్చారు పోలీసులు. మీడియా కంట పడకుండా మహేశ్ యాదవ్ ను దొడ్డి దారిన తప్పించారు పోలీసులు. పోలీస్ వాహనాలు బయటికి తీసుకొచ్చి ఎంపీ కారులో ఎక్కించి పంపించి వేశారు.
మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో దర్యాఫ్తు ముమ్మరం చేసింది ఈగల్ టీమ్. మొత్తం 11 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల నుంచి కీలక సమాచారం లాగుతున్నారు. డ్రగ్స్ ఎలా వచ్చాయి? ఎవరు సరఫరా చేశారు? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. డ్రగ్స్ కేసులో పట్టుబడిన వారికి యూరిన్ టెస్ట్ నిర్వహించగా మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డితో పాటు మరో ఐదుగురికి డ్రగ్ పాజిటివ్ వచ్చినట్లుగా తెలుస్తోంది. మొయినాబాద్ ఫామ్ హౌస్ ను సీజ్ చేసే అవకాశం ఉంది. వరుస అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన ఫామ్ హౌస్ ను సీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
