Munugode By Poll : మునుగోడులో కేంద్ర బలగాలు .. మంత్రి మల్లారెడ్డి కారు తనిఖీలు చేసిన సీఐఎస్ఎఫ్ బలగాలు
మునుగోడులో కేంద్ర బలగాలు ఎంటరయ్యాయి. మునుగోడు ఉప ఎన్నిక జరుగనున్న క్రమంలో అన్ని వాహనాలను తనిఖీలు నిర్వహిస్తున్నాయి కేంద్ర బలగాలు.దీంట్లో భాగంగా మంత్రి మల్లారెడ్డి కారు తనిఖీలు నిర్వహించాయి.

munugode by elections _ Minister Mallareddy car checked by central force
Munugode By Poll : తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మునుగోడు పేరే నానుతోంది. మునుగోడులో ఉప ఎన్నిక జరుగనున్న క్రమంలో పెద్ద ఎత్తున నగదు పట్టుబడుతోంది. దీంతో ముమ్మరంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో మునుగోడులో కేంద్ర బలగాలు ఎంటర్ అయ్యాయి. ఈ ఉప ఎన్నిక ఇటు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు ప్రతిష్టాత్మకంగా మారిన క్రమంలో ‘మునుగోడు’కేంద్ర బలగాల చేతిలో అష్టదిగ్బంధంగా మారింది.
రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారిన ఉపఎన్నికల వేళ.. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర బలగాలు మోహరించాయి. ఇప్పటికే కీలకమైన పలు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్న బలగాలు.. టోల్ప్లాజాలు, చెక్పోస్టుల వద్ద విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఉపఎన్నికల వేళ మద్యం, డబ్బు ప్రవాహాన్ని కట్టడి చేసేందుకు బలగాలు రంగంలోకి దిగాయి. ఎక్కడిక్కడ వాహనాలను కేంద్ర బలగాళు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నాయి.
హైవేపై రెండు టోల్ గేట్ల వద్ద కేంద్ర బలగాలు సోదాలు నిర్వహిస్తున్న సమయంలో అటుగా వచ్చిన మంత్రి మల్లారెడ్డి కారును కూడా తనిఖీలు చేశారు. అరెగూడెం వెళ్లుతున్న మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్ ను ఆపి తనిఖీలు నిర్వహించాయి. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో కేంద్ర బలగాలు నియోజకవర్గానికి చేరుకున్నాయి. సీఐఎస్ఎఫ్ బలగాలు చండూరు పట్టణంలో మంగళవారం (అక్టోబర్ 18,2022)కవాతు నిర్వహించాయి. చండూరు పట్టణంలోని ఎస్బీఐ శాఖ నుంచి ప్రధాన చౌరస్తా మీదుగా అంగడిపేట, పట్టణంలోని పలు వీధుల్లో కవాతు నిర్వహించాయి.