JaggaReddy On Osmania University : రాహుల్ గాంధీని ఉస్మానియా యూనివర్సిటీకి తీసుకెళ్లే విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తగ్గేదేలే అంటున్నారు. ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రాహుల్ గాంధీని ఉస్మానియా యూనివర్సిటీకి తీసుకెళతామని జగ్గారెడ్డి తేల్చి చెప్పారు. రాహుల్ గాంధీ ఓయూ పర్యటనకు అనుమతి ఇవ్వలేదని, అందుకే మా కార్యకర్తలు ఆందోళన చేశారని జగ్గారెడ్డి తెలిపారు.
ఉస్మానియా యూనివర్సిటీ కష్టం అంతా ఆవిరి అయిపోయిందని ఆయన వాపోయారు. ఉస్మానియాలో చదివిన వారు చాలామంది ఎమ్యెల్యేలు అయ్యారని గుర్తు చేసిన జగ్గారెడ్డి.. ఒక్క ఎమ్మెల్యే కూడా కేసీఆర్ ను యూనివర్సిటీకి ఎందుకు తీసుకుపోలేదని ప్రశ్నించారు. ఒక్క ఎమ్మెల్యేకి కూడా సంస్కారం లేదని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర సాధనకు ప్రాణాలు అర్పించిన వారి ఆత్మలు ఘోషిస్తున్నాయని వాపోయారు.(JaggaReddy On Osmania University)
Rahul Gandhi : ఓయూలో రాహుల్ సభకు నో పర్మిషన్
రాహుల్ గాంధీది సభ కాదు, సందర్శన మాత్రమే అని, ఓ ఎంపీగా ఓయూని చూడటానికి వస్తున్నారని జగ్గారెడ్డి వెల్లడించారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు తాను ఓయూ వీసీని కలుస్తానన్నారు జగ్గారెడ్డి. ఉస్మానియా విశ్వవిద్యాలయ విశిష్టతను తెలుసుకునేందుకు రాహుల్ వస్తుంటే… అడ్డుకునేందుకు మీరెవరు? అని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో లేని జీవోలు ఇప్పుడెలా తీస్తారని నిలదీశారు. కృతజ్ఞత లేని రాష్ట్రంగా తెలంగాణను ఎందుకు చేస్తున్నారని అడిగారు.
ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ ప్రజలు అవమానాలకు గురి కావాలా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. రాహుల్ గాంధీతో ముగ్గురు ఎంపీలు, ఆరుగురు ప్రజా ప్రతినిధులు ఉస్మానియాలో సందర్శిస్తామన్నారు జగ్గారెడ్డి. ఈ నెల 7న ఎట్టి పరిస్థితుల్లో రాహుల్ గాంధీని ఉస్మానియాకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఈ అంశంపై సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఉస్మానియా యూనివర్సిటీ వీసీని కలుస్తామని, రాహుల్ పర్యటనకు అనుమతి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని జగ్గారెడ్డి చెప్పారు.(Jagga Reddy On OU)
కాగా.. ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సభకు అనుమతి దక్కలేదు. రాహుల్ సభకు అనుమతి ఇవ్వకూడదని ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. రాహుల్ గాంధీ సభకే కాదు.. అసలు ఉస్మానియా యూనివర్సిటీలో ఏ బహిరంగ సభలకు కూడా అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించింది. అంతేకాదు క్యాంపస్లోకి కెమెరాలను కూడా నిషేధించింది. ఈనెల 7న ఉస్మానియా వర్సిటీలోని ఆర్ట్ కాలేజీ వద్ద.. రాహుల్ గాంధీ విద్యార్థులను కలిసేలా టీపీసీసీ ప్లాన్ చేసింది. కానీ.. వారికి ఓయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ షాకిచ్చింది. దీనిపై కొన్ని విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. ఓయూలో ఆందోళనకు దిగాయి.
రాహుల్ సభకు పర్మిషన్ ఇవ్వకపోవడం పట్ల కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్యూఐ ఫైర్ అయ్యింది. ఓయూలో నిరసనలు తెలిపింది. దీంతో వర్సిటీ ప్రాంగణంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు విద్యార్థి సంఘాల నేతలు ప్రయత్నించారు. దీంతో ఆర్ట్స్ కాలేజీ ముందు విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. అరెస్టులు, ఆందోళనలు, నిరసనలతో ఓయూ రణరంగాన్ని తలపించింది.