Sitaram Yechury : ప్రజా సమస్యలపై పోరాడే ఎర్రజెండాను గెలిపించాలి : సీతారాం ఏచూరి
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సీతారాం ఏచూరీ రోడ్ షో నిర్వహించారు. మిర్యాలగూడ సీపీఎం అభ్యర్థి జూలకంటి రంగారెడ్డిని గెలిపించాలని కోరుతూ ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
- bheemraj
- Updated on- November 27, 2023 / 03:34 PM IST
Sitaram Yechury (1)
Sitaram Yechury Election Campaign : ప్రజా సమస్యలపై పోరాడే ఎర్రజెండాను గెలిపించాల్సిన ఎంతైనా ఉందని సీపీఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ప్రజా సమస్యలను శాసనసభలో లేవనెత్తే జూలకంటి రంగారెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ రోడ్ షో, ర్యాలీ చూసిన తర్వాత భవిష్యత్తులో రంగన్న ఎమ్మెల్యేగా ఉంటాడని అర్థమైందన్నారు. మిర్యాలగూడకు భవిష్యత్తు జూలకంటి రంగన్న అని స్పష్టం చేశారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సీతారాం ఏచూరీ రోడ్ షో నిర్వహించారు. మిర్యాలగూడ సీపీఎం అభ్యర్థి జూలకంటి రంగారెడ్డిని గెలిపించాలని కోరుతూ ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వేములపల్లి నుండి మిర్యాలగూడ పట్టణంలోని రాజీవ్ చౌక్ వరకు ఏచూరీ రోడ్ షో కొనసాగింది. రోడ్ షోలో సీపీఎం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏచూరీ మాట్లాడారు.
PM Modi : కాంగ్రెస్, బీఆర్ఎస్ తెలంగాణను నాశనం చేశాయి : ప్రధాని మోదీ
40 – 50 సంవత్సరాల నుంచి ఎర్రజెండానే నమ్ముకున్న వ్యక్తి జూలకంటి రంగన్న అని అన్నారు. ప్రజలు తమకు ఓటు వేయడానికి ఒక ముఖ్య కారణం ఉందన్నారు. ప్రజల సమస్యలను శాసనసభలో లేవనెత్తే ఏకైక వ్యక్తి రంగన్న అని, అందుకు మిర్యాలగూడ నుంచి ఓటు అడుగుతున్నామని తెలిపారు. ప్రజల కోసం రంగన్న గెలవాలన్నారు. మిగతా పార్టీలకు ఎంత ధన బలం ఉన్నా.. ప్రజా బలం ఉన్న ఏకైక వ్యక్తి రంగన్న అని పేర్కొన్నారు.
పార్టీ వాళ్లకు రాజకీయమంటే ఒక వ్యాపారం అన్నారు. సాయుధ తెలంగాణ పోరాటం, వారసత్వం మన దగ్గర మాత్రమే ఉందన్నారు. ఎర్రజెండాను గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. తాము పోటీ చేస్తున్న 19 సీట్లలో తమ అభ్యర్థులను గెలిపించాలని మనవి చేశారు. 80 కోట్ల మందికి ఐదు కిలోల రేషన్ బియ్యం చట్టం తమ వల్లనే వచ్చిందన్నారు.
దేశంలో మతసామరస్యం, ఐక్యత దెబ్బతింటుందని చెప్పారు. ప్రజాస్వామ్యంపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. మన భారతదేశాన్ని, మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చే ప్రభుత్వం మోదీకి అనుకూలంగా ఉండేది రాకూడదని అభిప్రాయపడ్డారు.
