Registrations in telangana shutdown till monday : తెలంగాణలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. నేడు రిజిస్ట్రేషన్లు జరగవు. మూడు రోజుల పాటు బంద్ కానున్నాయి. హైదరాబాద్ గచ్చిబౌలిలోని స్టేట్ డేటా సెంటర్ (ఎస్డీసీ)లో మెరుగైన పవర్ బ్యాకప్ కోసం కొత్త యూపీఎస్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 11వ తేదీ వరకు ప్రభుత్వ వెబ్సైట్ సేవలకు అంతరాయం కలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది.
ఎస్డీసీ స్తంభించిపోతుండటంతో రిజిస్ట్రేషన్ల కార్డు పోర్టల్ కూడా పని చేయదని, దీంతో నేడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరగవని అధికారులు వివరించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ రిజిస్ట్రేషన్లకు ప్రాతిపదికగా ఉన్న కార్డు విధానం, రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్ సేవలు గురువారం రాత్రి ఏడు గంటల నుంచే నిలిచిపోయాయి. దీంతో రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లతోపాటు ఇతర సేవలూ అందుబాటులో ఉండవని అధికారులు తెలిపారు. ఇక శని(రెండో), ఆదివారాలు సెలవు కావడంతో రిజిస్ట్రేషన్లు తిరిగి సోమవారం నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించారు.