RPF Woman Constable Rescued : హైదరాబాద్ బేగంపేట రైల్వే స్టేషన్ లో ఓ యువతి ప్రాణాలను ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ కాపాడారు. ప్రమాదవశాత్తు రైలు కింద పడబోయిన యువతిని రక్షించారు. మంగళవారం ఉదయం 9 గంటలకు బేగంపేట రైల్వే స్టేషన్ కు లింగంపల్లి – ఫలక్ నుమా ఎంఎంటీఎస్ రైలు చేరుకుంది.
అయితే, కదులుతున్న రైలును ఎక్కేందుకు సరస్వతి అనే యువతి ప్రయత్నించారు. కానీ, రైలు వేగంగా ముందుకు కదలడంతో ఆమె ఫ్లాట్ ఫామ్, రైతు మధ్య పడబోయారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ కే.సనిత అప్రమత్తమై సరస్వతిని వెనక్కి లాగారు.
దీంతో ఆమె ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. కానిస్టేబుల్ సనితపై రైల్వే అధికారులు, నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపించారు. నల్గొండకు చెందిన కే సనిత 2020లో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గా ఎంపికయ్యారు. ప్రస్తుతం బేగంపేట రైల్వే స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్నారు.