Rayalaseema Lift Irrigation
Rayalaseema Lift Irrigation : రాయలసీమ ఎత్తిపోతల పథకం వివాదంపై రెండవసారి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ వేసింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతుందని తెలిపింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు ఆపాలని పిటిషన్ లో కోరింది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఇదే అంశంపై తెలంగాణ ప్రభుత్వం గతంలో కూడా గ్రీన్ ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేసింది. ఇది అక్రమమని తెలిపింది. ప్రాజెక్టు నిర్మాణ పనులను అడ్డుకోవాలని కోరింది.
ఇక ఇదిలా ఉంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న నాటి నుంచే దీనిపై వివాదం కొనసాగుతుంది. పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు అక్రమంగా నీటిని తరలిస్తున్నారంటూ దివంగత నేత పీ జనార్దన్ రెడ్డి దీనిపై కొట్లాడారు. నిబంధనలకు విరుద్దంగా నీటిని తరలిస్తే తెలంగాణ ఎడారిగా మారుతుందని అసెంబ్లీలో బలంగా తన గళం వినిపించారు జనార్దన్ రెడ్డి. తిరిగి 14 ఏళ్ల తర్వాత ఈ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది.
ఈ ప్రాజెక్టు అక్రమమని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తుంది. గత రెండు వారాలుగా తెలంగాణ, ఆంధ్రా మంత్రులు ఇదే అంశం మీద ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. కాగా తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ లోని 11, 12 పేజీలలో ప్రాజెక్టుకు సంబందించిన పూర్తి వివరాలు సమర్పించింది.