Rythu Bharosa : తెలంగాణ రైతులకు భారీ శుభవార్త.. రైతుభరోసా నిధులు వచ్చేస్తున్నాయ్.. పంపిణీ ఎప్పుడంటే..?
Rythu Bharosa : తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకంపై కీలక ప్రకటన చేసింది. వచ్చే నెల చివరి వారంలో అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో
- Harishth Thanniru
- Published On : December 27, 2025 / 08:22 AM IST
Rythu Bharosa
Rythu Bharosa : తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో రైతు భరోసా పథకాన్ని నిలిపివేశారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని.. జనవరి నెలలో పథకం కింద అర్హులైన లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నిధులు జమ అవుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అదేవిధంగా రైతు భరోసా విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి షరతులు విధించలేదని తెలిపింది.
Also Read: Cm Revanth Reddy: పెన్షన్లపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్.. పెంచేందుకు మాస్టర్ ప్లాన్..!
రైతు భరోసా పథకం అమలుపై తెలంగాణ ప్రభుత్వ ఫ్యాక్ట్చెక్ విభాగం ‘ఎక్స్’లో పోస్టు పెట్టింది. రైతుభరోసా కింద తెలంగాణ వ్యాప్తంగా 65లక్షల మందికిపైగా రైతులు లబ్ధిపొందుతున్నారు. ఆ పథకాన్ని ప్రభుత్వం నిలిపివేయడం లేదు. ప్రస్తుతం సంబంధిత జిల్లా కమిటీలు నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం అందేలా చూసుకోవడానికి క్షేత్ర స్థాయిలో తనిఖీ నిర్వహిస్తున్నాయి. అదేవిధంగా ఆర్థిక శాఖ కూడా లబ్ధిదారులకు చెల్లింపులు జరిపేందుకు జాబితాను సిద్ధంచేసి తిరిగి తనిఖీ కూడా నిర్వహిస్తోంది అని స్పష్టం చేసింది.
ఇదిలాఉంటే.. వచ్చే నెల సంక్రాంతి పండుగ తరువాత అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతుభరోసా నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది. శాటిలైట్ ఇమేజెస్ ద్వారా రైతులు సాగుచేసిన పంట డేటాను సిద్ధం చేస్తున్న అధికారులు.. జనవరి రెండో వారం వరకు అర్హులైన రైతుల వివరాలను సిద్ధం చేసేందుకు చర్యలు ముమ్మరం చేశారు. తుది జాబితాను ప్రభుత్వానికి అందించిన కొద్దిరోజులకే అంటే.. వచ్చే నెల చివరి వారంలోగా రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం.
అయితే, పంటలు సాగు చేయని రైతులకు రైతుభరోసా డబ్బులు పడే అవకాశం ఉండదని తెలుస్తోంది. ఈసారి పంటలు సాగు చేయని భూములను రైతు భరోసా నుంచి మినహాయింపు ఇచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ విషయాన్ని అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే చాన్స్ ఉందని తెలుస్తోంది.
ఒకవేళ జాబితా నుంచి పేర్లు తొలగించినా, అభ్యంతరాలు ఉన్నా వివరణకోసం రైతులు జిల్లా కలెక్టర్, జిల్లా స్థాయి రెవెన్యూ అధికారులను సంప్రదించే అవకాశం ఉంటుంది.
