Boinapally Vinod Kumar : తెలంగాణలో బీజేపీ గెలవదని మోదీ మాటల్లోనే తెలుస్తోంది, అది ఆయనే అంగీకరించారు : వినోద్ కుమార్
మోడీతో సహా ఢిల్లీ బీజేపీ నేతలంతా ఢిల్లీలో ఒక మాట గల్లీలో ఒక మాట మాట్లాడతారు.తెలంగాణలో బీజేపీ గెలిచే అవకాశాలు లేవు కాబట్టే మోడీ నిధులు ఇవ్వకుండా, హామీలు లేకుండా ప్రసంగం ముగించారు.
- nagamani
- Published On : July 8, 2023 / 02:33 PM IST
Boinapally Vinod Kumar
PM MOdi In Warangal sabha : వరంగల్ విజయసంకల్ప సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ప్రధాని వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. వరంగల్ జిల్లా నిండు బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ.. రాష్ట్రంలో బీజేపీ ఓటమిని అంగీకరించారని అన్నారు. ఎన్నికలు ఉండే రాష్ట్రాల్లో పర్యటన సందర్భంగా భారీగా నిధులు ఇచ్చి, హామీలు కురిపించే నరేంద్ర మోదీ వరంగల్ సభలో ఒక్క రూపాయి ప్రకటించ లేదని.. ఎలాంటి హామీ ఇవ్వలేదంటూ విమర్శించారు. తెలంగాణలో బీజేపీ గెలిచే అవకాశాలు లేవు కాబట్టే మోదీ నిధులు ఇవ్వకుండా, హామీలు లేకుండా ప్రసంగం ముగించారని ఎద్దేవా చేశారు.
Minister Harish Rao: మీకు అండగా ఈడీలు, సీబీఐలు ఉండొచ్చు.. మాకు తెలంగాణ ప్రజలు అండగా ఉంటారు..
మోదీతో సహా ఢిల్లీ బీజేపీ నేతలంతా ఢిల్లీలో ఒక మాట, గల్లీలో ఒక మాట మాట్లాడతారు అంటూ సెటైర్లు వేశారు. జాతీయ రహదారులు తెలంగాణ రాష్ట్ర హక్కు.. విభజన చట్టం, పార్లమెంట్ లో ఆమోదం మేరకే రాష్ట్రానికి జాతీయ రహదారులు అని అన్నారు. ఉద్యోగాల కామన్ రిక్రూట్మెంట్ బిల్లును గవర్నర్ చేత తొక్కిపెట్టి ఇప్పుడు యూనివర్సిటీలో ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని మోదీ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీలోనే 200 మంది వరకు నాయకుల వారసులు రాజకీయాల్లో ఉన్నారని, వారసత్వ రాజకీయాలపై మాట్లాడే అర్హత మోదీకి లేదన్నారు.
కొన్ని ట్రైలర్లు ట్రైలర్స్ కే పరిమితం అవుతాయి.. సినిమాలు మాత్రం విడుదల కావు.. బీజేపీ ట్రైలర్ కూడా అలాంటిదే అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీలకు అత్యధికంగా కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇచ్చి… ఇప్పుడు తెలంగాణాలో అభివృద్ధి లేదనడం మోదీ ద్వంద వైఖరికి నిదర్శనం అంటూ వినోద్ కుమార్ దుయ్యబట్టారు.
