Robot Teacher: సర్కారీ బడిలో ‘రోబో టీచర్’.. విద్యార్థులకు ‘Ai’ పాఠాలు.. ప్రభుత్వ పాఠశాలలో హైటెక్ విప్లవం
సిరిసిల్ల పట్టణం ప్రభుత్వ పాఠశాలలో 'హ్యూమనాయిడ్ రోబో టీచర్(Robot Teacher)'ను అధికారికంగా అందుబాటులోకి తీసుకువచ్చారు.
Telangana sircilla government school introduces humanoid robot teacher
- సిరిసిల్ల సర్కారీ బడిలో రోబో
- అందుబాటులోకి హ్యూమనాయిడ్ ఏఐ టీచర్
- విద్యార్థులకు ఆసక్తికర డిజిటల్ పాఠాలు
Robot Teacher: సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మరింత చేరువ చేసే దిశగా తెలంగాణ విద్యారంగంలో ఒక అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని సిరిసిల్ల పట్టణం గీతానగర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కోసం ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. బెంగళూరుకు చెందిన ప్రముఖ ‘ఇండస్’ సంస్థ భాగస్వామ్యంతో సరికొత్త ‘హ్యూమనాయిడ్ రోబో టీచర్’ను పాఠశాలలో అధికారికంగా అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రభుత్వ బడులలో చదివే పిల్లలకు కూడా కార్పొరేట్, అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలను అందించాలనే లక్ష్యంతో ఈ అధునాతన ఏఐ (AI) ప్రాజెక్టును ఇక్కడ ప్రారంభించడం విశేషం.
ఆసక్తికరంగా డిజిటల్ పాఠాలు – సులువుగా విద్యాబోధన:
ఈ హ్యూమనాయిడ్ రోబో (Robot Teacher)రాకతో విద్యార్థులకు పాఠ్యాంశాలు ఎంతో ఆసక్తికరంగా, రంగులమయంగా మారనున్నాయి. రోబో ద్వారా లభించే విజువల్స్, కృత్రిమ మేధతో కూడిన బోధన వల్ల పిల్లలు కష్టమైన అంశాలను సైతం చాలా సులభంగా అర్థం చేసుకోగలరని ఇండస్ కంపెనీ డైరెక్టర్ విఘ్నేష్ రావు, హెచ్వైడీ కమ్యూనిటీ ప్రాజెక్టు ప్రతినిధి శామ్యూల్ జోసెఫ్ వెల్లడించారు. రోబో బోధన వల్ల ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో సైన్స్, టెక్నాలజీ పట్ల ఆసక్తి విపరీతంగా పెరుగుతుందని పాఠశాల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
సాంకేతిక విప్లవానికి నాంది – ప్రముఖుల అభినందనలు:
ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విప్లవానికి బాటలు వేసేలా ఇటువంటి సాంకేతిక ప్రాజెక్టును ప్రవేశపెట్టడం పట్ల స్థానిక నాయకులు, అధికారులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రముఖ నేత కొండూరి రవీందర్ రావుతో పాటు మున్సిపల్ ఛైర్మన్ జిందం కళా చక్రపాణి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో మిగతా సర్కారీ పాఠశాలల్లోనూ ఇలాంటి అధునాతన సాంకేతికతను విస్తరిస్తే పేద విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో మేలు జరుగుతుందని వారు ఆకాంక్షించారు.
