Mahesh Kumar Goud : జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అతనే.. కేటీఆర్ అరెస్టు ఖాయం : టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్
Mahesh Kumar Goud : జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో గెలవబోతున్నామని మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.
- Harishth Thanniru
- Updated on- October 3, 2025 / 07:46 PM IST
Mahesh Kumar Goud
TPCC Chief Mahesh Kumar Goud : బీసీ రిజర్వేషన్ల అమలులో చిత్తశుద్ధితో ఉన్నామని, రిజర్వేషన్లు అమలుతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తున్నామని, మా చిత్తశుద్ది ఎవరూ శంకించలేరని టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud)అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన గురువారం అక్కడి మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల అమలులో చిత్తశుద్ధితో ఉన్నామని స్పష్టం చేశారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో గెలవబోతున్నామని మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల్లో గెలిచేది మేమే. నియోజకవర్గంలో సర్వేలు చేస్తున్నాం. గెలిచే వారికే టికెట్ ఇస్తాం. సామాజిక వర్గం కాదు.. గెలిచే వారికే అవకాశం ఉంటుందని చెప్పారు.
డీసీసీ అధ్యక్షులు ఎంపిక కోసం నియమించిన పరిశీలకుల సమావేశం సాయంత్రం జరుగుతుందని, సమావేశానికి మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ హాజరవుతారని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీకి చిత్తశుద్ది లేదు. బీజేపీ తలుచుకుంటే ఒక్కరోజులోనే అయిపోతుంది. అసెంబ్లీ చట్టం చేశాక కూడా కేంద్రం ముందడుగు వేయడం లేదని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతిపై చట్టబద్ధంగా వ్యవహరిస్తున్నాం. మేము కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం లేదు. తప్పు చేసిన వారు, అవినీతికి పాల్పడినప్పుడు శిక్ష ఎదుర్కోవాల్సిందే. జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధమన్న కేటీఆర్ కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఫార్ములా ఈ-కారు కేసులో కేటీఆర్ అడ్డంగా దొరికిపోయాడు. అరెస్టు కాక తప్పుదని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
