Mahesh Kumar Goud: తులం బంగారం హామీ.. పథకం అమలు సాధ్యం కాదా? మహేశ్ కుమార్ గౌడ్ సంచలన కామెంట్స్
ఉచితంగా తులం బంగారం(Mahesh Kumar Goud) ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఆ పథకాన్ని అమలు చేయలేమని పరోక్షంగా స్పష్టం చేసింది.
- V Santhosh Kumar
- Published on- September 7, 2026 / 09:46 AM IST
TPCC Chief Mahesh Kumar Goud sensational comments on free gold scheme.
- తులం బంగారం అమలు కాదా
- కాంగ్రెస్లోకి టీడీపీ నేతల చేరిక
- ఎమ్మెల్సీ ఎన్నికలు రెఫరెండం కాదు
Mahesh Kumar Goud: ఎన్నికల సమయంలో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద ఉచితంగా తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఆ పథకాన్ని అమలు చేయలేమని పరోక్షంగా స్పష్టం చేసింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) ఒక టీవీ ఛానెల్ డిబేట్లో మాట్లాడుతూ, తాము ఎన్నికల హామీ ఇచ్చినప్పటి బంగారం ధరలకు, ఇప్పటి మార్కెట్ ధరలకు వ్యత్యాసాన్ని బేరీజు వేశారు. అంతేకాకుండా, ప్రస్తుతం ప్రజలు ఎవరూ కూడా తులం బంగారం గురించి అడగడం లేదంటూ ఆయన వ్యాఖ్యానించడం రాష్ట్ర రాజకీయంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్లోకి టీడీపీ చేరికలు.. మహేశ్కుమార్గౌడ్ సంచలన వ్యాఖ్యలు:
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉనికిపై స్పందిస్తూ, టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున కాంగ్రెస్లోకి వచ్చేస్తున్నాయని ఆయన సంచలన కామెంట్స్ చేశారు. పార్టీలోకి కొత్త నీరు రావడం సహజమని, టీడీపీ నేతలను ఆహ్వానించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ స్థిరత్వానికి ఇతర పార్టీల నుండి వచ్చిన 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు అండగా నిలిచారనే విషయాన్ని మహేశ్కుమార్గౌడ్ బహిరంగంగానే అంగీకరించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.
ఎమ్మెల్సీ ఎన్నికలపై దాటవేత ధోరణి.. రెఫరెండం కాదన్న టీపీసీసీ చీఫ్:
త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు రెఫరెండంగా భావిస్తారా అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, ఆయన ఆ అంశాన్ని తీవ్రంగా తోసిపుచ్చారు. ఎన్నికల్లో గెలుపోటములు సాధారణ విషయమని, ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రభుత్వ పాలనపై రెఫరెండంగా చూడకూడదని దాటవేసే ప్రయత్నం చేశారు. ఇచ్చిన హామీలను పక్కనబెట్టడం, ఫిరాయింపులను ప్రోత్సహించడంపై ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.
