TSRTC Special Buses: 28న ప్రముఖ ఆలయాలకు టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
హైదరాబాద్ నుంచే కాకుండా ఆయా జిల్లా కేంద్రాల నుంచి ప్రముఖు పుణ్యక్షేత్రాలైన వేములవాడ, ధర్మపురి, యాదగిరిగుట్ట, మన్నెంకొండం తదితర ప్రాంతాలకు టీఎస్ ఆర్టీసీ ఈనెల 28న ప్రత్యేక బస్సులు నడపనుంది.
- Harishth Thanniru
- Updated on- January 26, 2023 / 09:55 PM IST
TS RTC
TSRTC Special Buses: రథసప్తమి సందర్భంగా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. తెలంగాణలోని ప్రముఖ ఆలయాలకు వెళ్లే వారికోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపేందుకు సిద్ధమైంది. హైదరాబాద్ తో పాటు వివిధ జిల్లాల కేంద్రాల నుంచి ప్రముఖ ఆలయాలకు వెళ్లేందుకు 80 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడపనుంది.
హైదరాబాద్ నుంచే కాకుండా ఆయా జిల్లాల నుంచి ప్రముఖు పుణ్యక్షేత్రాలైన వేములవాడ, ధర్మపురి, యాదగిరిగుట్ట, మన్నెంకొండం తదితర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడుస్తాయి. ఆదిలాబాద్ నుంచి గూడెంకు ఐదు ప్రత్యేక బస్సులను నడపనున్నారు. అదేవిధంగా హైదరాబాద్ కేపీహెచ్ బీ నుంచి అనంతగిరి వరకు ఐదు బస్సులు, మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నుంచి మన్నెంకొండకు పది బస్సులు, కరీంనగర్ నుంచి వేములవాడకు పది బస్సులు, ధర్మపురికి పది బస్సులు, నల్గొండ నుంచి యాదగిరి గుట్టకు పది ప్రత్యేక బస్సులను టీఎస్ ఆర్టీసీ నడపనుంది.
హైదరాబాద్ నగరంలోనూ ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. భాగ్యనగరంలోని జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి, చిలుకూరు బాలాజీ, సికింద్రాబాద్ మహంకాళి, హిమాయత్ నగర్ బాలాజీ టెంపుల్ తదితర ఆలయాలకు దర్శనానికి వెళ్లే భక్తుల కోసం టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ.. రథసప్తమి సందర్భంగా ప్రధాన ఆలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, ప్రయాణీకులు సురక్షితంగా తమతమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
