Komatireddy Raj Gopal Reddy: ప్రాణహాని ఉందని హైకోర్టును ఆశ్రయించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

ప్రాణహాని ఉందని..భద్రత ఏర్పాటు చేయాలని కోరుతు హైకోర్టును ఆశ్రయించారు తెలంగాణ బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

komatireddy rajgopal reddy petition in high court

Komatireddy Raj Gopal Reddy: మునుగోడు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంగళవారం తెలంగాణ హైకోర్టు (Telangana High Court)ను ఆశ్రయించారు. తనకు ప్రాణహాని ఉందని.. భద్రత కల్పించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటీషన్ పై విచారించిన ధర్మాసనం రాజగోపాల్ రెడ్డికి భద్రత కల్పించాలని పోలీసు అధికారులను ఆదేశించింది. రెండు వారాల్లో 2+2 భద్రత ఏర్పాటు చేయాలని డీజీపీకి డీజీపీకి, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీకి ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరడంతో మునుగోడుకు ఉప ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. నియోజకవర్గ అభివృద్ధి కోసమే రాజీనామా చేసినట్టు అప్పట్లో ఆయన ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం కొరవడిందని, అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు రావడం లేదని ఉప ఎన్నికల ప్రచారంలో ఆరోపించారు. ఈ ఎన్నికలో రాజగోపాల్ రెడ్డి ఓటమిపాలయ్యారు. బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి (Kusukuntla Prabhakar Reddy) విజయం సాధించారు. దీంతో రాజగోపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేగా మిగిలిపోయారు.

ప్రతిష్టాత్మకంగా జరిగిన ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి మౌనంగా ఉన్న ఆయన మరోసారి తెరపైకి వచ్చారు. తనకు తనకు ప్రాణహాని ఉందంటూ హైకోర్టు తలుపు తట్టారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఓడిపోవడంతో బీజేపీ కూడా ఆయనను పెద్దగా పట్టించుకోవడం లేదన్న గుసగుసలు విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Also Read: పరీక్షలు రద్దు చేయటం కాదు.. కేసీఆర్ ప్రభుత్వాన్నే రద్దు చేయాలి