హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బీజేపీ నిర్వహించిన బీసీ ఆత్మగౌరవ సభలో పలు ఇంట్రస్టింగ్ సీన్స్ చోటు చేసుకున్నాయి. ఈ సభలో ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. సభ మొత్తం మోదీ పక్కనే కనిపించారు పవన్ కల్యాణ్. పవన్ కల్యాణ్ కు మోదీ ఇచ్చిన ఇంపార్టెన్స్ బీజేపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. పవన్ కు ప్రధాని మోదీ నమస్కారం చేయడం, తన పక్కనే పవన్ ని కూర్చోబెట్టుకోవడం, అప్పుడప్పుడు పవన్ తో మాట్లాడటం, పలు అంశాలను పవన్ తో ప్రస్తావించడం.. ఇవన్నీ హైలైట్స్. ఇంతకీ పవన్ కల్యాణ్ కు మోదీ ఎందుకంత ఇంపార్టెన్స్ ఇచ్చారు? తన పక్కనే ఎందుకు కూర్చోబెట్టుకున్నారు? పవన్ కల్యాణ్ తో మోదీ ఏం మాట్లాడారు? ఇప్పుడీ ప్రశ్నలు ఆసక్తిని రేపుతున్నాయి.
ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్య ఉన్న సానిహిత్యం మరోసారి బయటపడింది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. పవన్ ను ప్రధాని మోదీ ఆపాయ్యంగా పలకరించారు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు. నవ్వులు చిందించారు.
ఒకవైపు బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కూర్చోబెట్టుకున్న మోదీ.. మరోవైపున పవన్ కల్యాణ్ కి అవకాశం కల్పించారు. పక్కనే కూర్చోబెట్టుకున్నారు. మధ్య మధ్యలో పవన్ తో ముచ్చటించారు మోదీ. పవన్ కల్యాణ్ కూడా అంతే అప్యాయంగా మోదీతో మాట్లాడారు. ఇక పవన్ స్పీచ్ మొత్తం ప్రధాని మోదీని పవర్ ఫుల్ లీడర్ గా పొగుడుతూనే సాగింది. మరోసారి మోదీ నాయకత్వం దేశానికి అవసరం అంటూ చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్. తెలంగాణలో అభివృద్ధికి బాటలు వేసే, అణగారిన వర్గాలకు అధికారాన్ని ఇచ్చే బీజేపీ.. గద్దెనెక్కేందుకు తన సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు పవన్ కల్యాణ్.
బీసీ ఆత్మగౌరవ సభలో మోదీని ఆకాశానికి ఎత్తేశారు జనసేనాని పవన్ కల్యాణ్. దేశానికి దిక్సూచి మోదీ అంటూ ప్రశంసలతో ముంచెత్తారు. మోదీ వచ్చిన తర్వాతే అన్ని రంగాల్లో దేశం అభివృద్ధి చెందిందని, శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారని, దేశ ప్రజల గుండెల్లో ధైర్యం నింపారని కొనియాడారు. దేశం అస్తవ్యస్తంగా, అగమ్యగోచరంగా ఉన్న సమయంలో ఒక బలమైన నాయకుడు రావాలని కోరుకున్నానని, నాలానే కోట్లాది మంది ప్రజలు అనుకున్నారని, వారందరి కలల ప్రతిరూపమే ప్రధాని మోదీ అని పవన్ అన్నారు. మోదీ తనకు అత్యంత అభిమాన నాయకుడిగా మారిపోయారని పవన్ అన్నారు. తన రోల్ మోడల్ మోదీయే అంటూ ప్రకటించారు పవన్ కల్యాణ్.
ఇక, మోదీ సభకు గంట ముందే చేరుకున్నారు పవన్ కల్యాణ్. తెలంగాణ బీజేపీ నాయకులతో సన్నిహితంగా మెలిగారు. సభా వేదికపైకి వచ్చిన ప్రధాని మోదీ.. అందరితో పాటు పవన్ కు కూడా నమస్కారం చేయడం విశేషం. అంతేకాదు.. పవన్ ను తన పక్కనే కూర్చోపెట్టుకుని పలు విషయాలపై చర్చించారు. తెలంగాణ రాజకీయాలపై రూట్ మ్యాప్ ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది.