World Sparrow Day 2024 : పిచుకుల ఉసురు తీస్తున్న సెల్ టవర్లు.. చలించిపోయిన పక్షి ప్రేమికుడు.. ఏం చేశాడంటే?
World Sparrow Day 2024 : ప్రస్తుత కాలంలో పిచ్చుకల కష్టాన్ని చూసిన ఓ పక్షి ప్రేమికుడు చలించిపోయాడు. అవి స్వేచ్ఛగా బతికేందుకు వినూత్నంగా ప్రత్యేక నివాసాలను ఏర్పాటు చేశాడు. మార్చి 20 ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా ఈ స్పెషల్ స్టోరీ చూద్దాం.
![World Sparrow Day 2024 : పిచుకుల ఉసురు తీస్తున్న సెల్ టవర్లు.. చలించిపోయిన పక్షి ప్రేమికుడు.. ఏం చేశాడంటే? World Sparrow Day 2024 : పిచుకుల ఉసురు తీస్తున్న సెల్ టవర్లు.. చలించిపోయిన పక్షి ప్రేమికుడు.. ఏం చేశాడంటే?](https://10tv.in/wp-content/uploads/2024/03/Bird-Lover-Turns-House-Into-Bird-Sanctuary.jpg)
Bird Lover Turns House Into Bird Sanctuary
World Sparrow Day 2024 : పల్లెలు, పట్టణాల్లో సెల్ఫోన్ల వాడకం పెరిగిపోవడం వల్ల పక్షిజాతి మనుగడ ప్రశ్నార్థకమైంది. సెల్ఫోన్ టవర్ల కారణంగా రేడియేషన్ పెరిగి పిచ్చుకలు గతి తప్పి గమ్యాన్ని చేరుకోలేకపోతున్నాయి. విశాల ప్రపంచంలో బతికే దారిలేక పిట్టలు రాలిపోతున్నాయి. ప్రస్తుత కాలంలో పిచ్చుకల కష్టాన్ని చూసిన ఓ పక్షి ప్రేమికుడు చలించిపోయాడు. అవి స్వేచ్ఛగా బతికేందుకు వినూత్నంగా ప్రత్యేక నివాసాలను ఏర్పాటు చేశాడు. మార్చి 20 ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా ఈ స్పెషల్ స్టోరీ చూద్దాం.
కొన్నేళ్ల క్రితం పిచ్చుకలు పంట చేలల్లో, ధాన్యపు రాశుల్లో కిలకిలమంటూ సందడి చేసేవి. గ్రామాల్లోని ఇండ్ల ముంగిట గుంపులుగా వాలడం… ఏదో అలికిడి కాగానే తుర్రుమని ఎగిరిపోవడం వంటి దృశ్యాలు కనిపించేవి. బావుల్లో, చెట్లపై పిచ్చుకల గూళ్లు వేలాడుతూ అద్భుతంగా ఉండేవి. ప్రస్తుత కాలంలో పిచ్చుకలు ఎదుర్కొంటున్న కష్టాన్ని చూసిన ఓ పక్షి ప్రేమికుడు చలించిపోయారు. పిచ్చుకలు స్వేచ్ఛగా ప్రకృతిలో భాగం అయ్యేందుకు వినూత్నంగా ఆలోచించి పిచ్చుకల కోసం ప్రత్యేక నివాసాలను ఏర్పాటు చేశారు.
తన ఇంటినే ఆవాసంగా మార్చిన రమేశ్ :
కరీంనగర్ జిల్లా కిసాన్నగర్కు చెందిన అనంతుల రమేశ్ పక్షుల ఆకలి, దప్పికలను తీరుస్తూ వాటి సంరక్షణకు తనవంతు బాధ్యతను నిర్వహిస్తున్నారు. పట్టణాల్లో అపార్ట్మెంట్ కల్చర్ పెరిగింది. ఇష్టారాజ్యంగా చెట్లను నరికివేయడంతో పిచ్చుకలకు నిలువ నీడ లేకుండా పోయింది. ఇదంతా చూసిన రమేశ్… తన ఇంటినే వాటికి ఆవాసంగా మార్చారు. పిచ్చుకలు కాలుష్యం బారిన పడకుండా అవి నివసించేందుకు అందమైన గూళ్లను తన ఇంటి ఆవరణలోనే ఏర్పాటు చేశారు. అంతరించి పోతున్న పిచ్చుకలను కాపాడేందుకు తాను ఈ ప్రయత్నం చేసినట్లుగా పక్షి ప్రేమికుడు అనంతుల రమేష్ తెలిపారు.
పిచ్చుకలు వాటికి ఇష్టమైన ఆహారం గడ్డి, తినేందుకు గింజల ఏర్పాటు చేయడంతో పాటు అనుకూలంగా ఉండే వాతావరణం కల్పించారు. తన ఇంటి వద్దే పిచ్చుకల కోసం అవసరమైన గింజలు, నీరు, వరి గొలుసులను ఏర్పాటు చేశారు. పిచ్చుకలు గూళ్లు కట్టుకోవడానికి వీలుగా గడ్డిని అందుబాటులో ఉంచారు.
తాను పెంచే చిలుకలతోపాటు కావాల్సినవన్నీ ఒకే చోట దొరకడంతో అక్కడికి వచ్చే పక్షుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మొదట్లో ఒకటి రెండు పక్షులు మాత్రమే వచ్చేవని.. ఇప్పుడు వాటి సంఖ్య పెరిగి ఉదయం పిచ్చుకల గుంపు చూస్తే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు రమేశ్. తమ ఇంటి ప్రాంగణంలో ఇలా పిచ్చుకల కోసం ధాన్యం గింజలు, నీటిని సమకూరిస్తే పక్షి జాతిని కాపాడుకునే అవకాశముంటుందని రమేశ్ అంటున్నారు.
Read Also : Rana Daggubati : బాలయ్య రికార్డులను బ్రేక్ చేయడానికి.. గట్టి ప్లాన్ వేస్తున్న రానా.. ఏంటో తెలుసా..!