ఓరుగల్లులో మరో ఆకర్షణ ప్రాంతం.. జైన క్షేత్రం

కాకతీయుల కాలం నాటి ఎన్నో అద్భుత దేవాలయాలు, కోటలతో మెరిసిపోతున్న ఓరుగల్లు పర్యాటక ప్రాంతాల ఖాతాలో ఇప్పుడు మరో ఆకర్షణ ప్రాంతం చేరనుంది. హన్మకొండలోని అగ్గలయ్య గుట్టను ‘హృదయ్’ పథకం కింద అభివృద్ధి చేశారు. కొండపై కొలువైన జైన మందిరం ఆహ్లాద కేంద్రంగా మారనుంది.
ఈ గుట్టపైకి చేరుకునేందుకు 450 మెట్లను తొలిచి మార్గాన్ని ఏర్పాటు చేశారు. రాతితో స్వాగత తోరణాలు నిర్మించి..ఎంతో అందంగా ముస్తాబు చేశారు. విద్యుత్తు దీపాలు, నీటి ఫౌంటేన్లు, మరుగుదొడ్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. మార్చి ఒకటి నుంచి ఈ గుట్టపైకి పర్యాటకులను అనుమతించనున్నారు.
రాష్ట్రంలో ‘హృదయ్’ పథకం దక్కిన ఏకైక నగరం ఓరుగల్లు. దీని కింద 2015లో రూ.35 కోట్ల వరకు మంజూరయ్యాయి. ఈ నిధులను ఖిలా వరంగల్, వేయిస్తంభాల గుడి, భద్రకాళి బండ్, పద్మాక్షి గుట్ట వంటి ఎన్నో పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాల అభివృద్ధి కోసం కేటాయించారు. కానీ హన్మకొండలోనే అత్యంత ఎత్తయిన అగ్గలయ్య గుట్టమీద జైన తీర్థంకరుల విగ్రహాలతోపాటు జైనుల గుహలు, ఆనవాళ్లు ఎన్నో ఉన్నాయి..అంతేకాదు జైన తీర్థంకరుడైన శాంతినాథుడి 30 అడుగుల విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. కొండ పైకి వెళ్లే దారి లేకపోవడంతో వెలుగులోకి రాలేదు. ఈ ప్రదేశం గురించి అప్పటి వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలికి తెలియడంతో ఆమె హృదయ్ పథకంకింద చేర్చి కోటిన్నర నిధులను మంజూరు చేశారు.