ఎన్నికల ప్రచారంలో : హరీశ్ రావుకి తృటిలో తప్పిన ప్రమాదం

మెదక్ జిల్లా సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావుకి తృటిలో పెను ప్రమాదం తప్పింది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం(మార్చి 29, 2019) తూప్రాన్లో జరిగిన రోడ్షోలో ఆయన పాల్గొన్నారు. ప్రచార వాహనం పైకి ఎక్కి హరీశ్రావు ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా జనరేటర్ నుంచి మంటలు చెలరేగాయి. దీంతో తన ప్రసంగాన్ని అర్థాంతరంగా నిలిపి వేసిన హరీశ్రావు వాహనం దిగి అక్కడి నుంచి వెళ్లి పోయారు. ఈ ఘటన జరిగినప్పుడు ఆ వాహనంపై ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురు పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు.
సుభాష్ చంద్రబోస్ సర్కిల్ దగ్గర ఒక్కసారిగా వాహనంలో మంటలు చెలరేగాయి. జనరేటర్లో లోపం వల్ల మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. చూస్తుండగానే ఆ వాహనం అగ్నికి ఆహుతైంది. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదం చూసి ఒక్కసారిగా షాక్ కు గురైన హరీశ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. గతంలో కూడా ఇలాంటి ప్రమాదం జరిగింది. ఎన్నికల ప్రచార సమయంలో కార్యకర్తలు బాణసంచా కాల్చగా ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం నుంచి హరీశ్రావు బయటపడ్డారు. ఇది రెండో ప్రమాదం.