నన్ను మోసం చేసినట్లు కాదు.. నేను భయపడను: పవన్ కల్యాణ్

ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో నాయకులు ఎంతోమంది ఆశతో వచ్చారని, ఆశయంతో రాలేదని అన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్. జనసేన పార్టీ మాత్రం ఆశయాలతో ముందుకు వెళ్తుందని, తనకు ఎన్నికల్లో ఓడిపోతానేమో అనే భయం లేదని, ఫలితం ఎలా ఉన్నా కూడా తనకు చింత లేదన్నారు. ఎన్ని సీట్లు వస్తాయనే అంశంపై దృష్టి పెట్టలేదని, ఎంత పోరాటం చేశామనే అంశం మీదే తన ఆలోచన ఉంటుందని అన్నారు.
మంగళగిరిలో ఆదివారం పార్టీ అభ్యర్థులతో మాట్లాడిన పవన్ కల్యాణ్.. ప్రతికూల పరిస్థితుల్లోనే వ్యక్తిత్వం బయటకు వస్తుందని, ఎవరి మనసులో అయినా మోసం చేయాలనే భావన వస్తే అది తనను మోసం చేసినట్టు కాదని, వారిని వారే మోసం చేసుకున్నట్లు అని అన్నారు. మార్పు అన్నది గొప్ప అంశమని, ఎమ్మెల్యే అన్నది చిన్న అంశమని.. మార్పు మొదలైందని.. అది గుర్తుపెట్టుకోవాలని పవన్ కల్యాణ్ అన్నారు.