అమరావతి ప్రాంతంలో 144సెక్షన్: గ్రామాల్లో భారీగా పోలీసుల మోహరింపు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలోని అన్ని గ్రామాల్లో పోలీస్ యాక్ట్ 34, సెక్షన్144 లు అమలులో ఉందని తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. రైతులు తమ ఆందోళనలు శాంతియుతంగా నిర్వహించాలని సూచించారు. చట్టాలను ఉల్లంఘిస్తే మాత్రం వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.
ఇవాళ(19 డిసెంబర్ 2019) 29 గ్రామాల్లో బంద్కు రైతులు పిలుపు ఇవ్వడంతో పాఠశాలలు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, హోటళ్లను స్వచ్ఛందంగా మూసివేశారు. ఈ క్రమంలోనే వెలగపూడిలో రిలే నిరాహారదీక్షలను రైతులు, కూలీలు ప్రారంభించనున్నారు. ఎల్లుండి నుంచి 29 గ్రామాల్లో గ్రామ సచివాల వద్ద రిలే నిరాహారదీక్షలు చేపట్టనున్నారు.
దీంతో రాజధాని ప్రాంతమంతా రణరంగం తలపిస్తుంది. రాజధాని ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. రాజధాని పరిధిలోని గ్రామాల్లో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ముగ్గురు అదనపు ఎస్పీలు, 10 మంది డీఎస్పీలు, 20 మంది సీఐలు, 30 మంది ఎస్సైలు శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు.