వావ్..సూది బెజ్జంలో ట్రంప్ విగ్రహం!..తెలంగాణ మైక్రో ఆర్టిస్ట్ టాలెంట్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ వచ్చారు. దీంతో ప్రధాని మోడీ హంగామా అంతా ఇంతా కాదు. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాకు చెందిన జాతీయ మైక్రో ఆర్టిస్ట్ మట్టెవాడ అజయ్ కుమార్.. ట్రంప్ సూక్ష్మశిల్పాన్ని ఓ సూది బెజ్జంలో చెక్కారు. కేవలం 1.00 మిల్లిమీటర్ల సూదిరంధ్రంలో మైనంతో ట్రంప్ విగ్రాహాన్ని చెక్కి అందరి దృష్టిని ఆకర్షించారు అజయ్ కుమార్. స్వర్ణకళాకారుడైన అజయ్ కుమార్ చిన్ననాటి నుంచి ఇటువంటి మైక్రో ఆర్ట్ లు తయారు చేయటంతో మంచి పేరు తెచ్చుకున్నాడు.
ఈ సూక్ష్మశిల్పాన్ని తయారు చేసేందుకు అజయ్ కుమార్ కు 4 రోజుల 13 గంటల సమయం పట్టిందని తెలిపారు. గతంలో కూడా అజయ్ కుమార్ ప్రధాని మోదీ సూక్ష్మ శిల్పాలను సూది రంధ్రంలో చెక్కి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. అంతేకాదు..క్రిస్మస్ పండుగ సందర్భంగా సూది బెజ్జంలో పట్టే ఏసుక్రీస్తు 0.9 మిల్లీ మీటర్ల విగ్రహాన్ని చెక్కారు. చేసుక్రీస్తు తలపై ముళ్లకిరీటం..చేతులకు, కాళ్లకు మేకులు కొట్టినట్లుగా..ఆ గాయాల నుంచి రక్తం కారినట్లుగా సంపూర్ణమైన ఏసుక్రీస్తు విగ్రహాన్ని చెక్కి అందిరి ప్రశంసలు పొందారు. వినాయక చవితి సందర్భంగా గణేషుడి విగ్రహాలను కూడా అజయ్ సూక్ష్మ విగ్రహాలను చెక్కారు.
కాగా 2019లో అక్టోబర్లో అజయ్ కుమార్ తొలిసారిగా ఏసీజీ వరల్డ్ గ్రూప్ వారు నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి ఆర్ట్ ఇన్ ఆ క్యాప్సుల్ కాంపిటీషన్లో మొదటి బహుమతి కింద 5 వేల డాలర్ ప్రైజ్మనీ గెలుపొందారు అజయ్ కుమార్. ఈ కాంపిటీషన్లో ఇండియా, అమెరికా, లాటిన్ అమెరికా, యూరప్ దేశాల నుంచి 80 మంది సూక్ష్మ కళాకారులు పాల్గొన్నారు.
ట్రంప్ విగ్రహం సైజులు ఇలా ఉన్నాయి…
ఎత్తు 1.25 మి.మీ.
వెడల్పు 0.32 మి.మీ.
అమెరికా జాతీయ జెండా
ఎత్తు 0.94 మి.మీ.
వెడల్పు 0.64 మి.మీ.