ఎన్నికల తాయిలాలు : డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్..రూ. 10వేలు

  • Published By: madhu ,Published On : January 20, 2019 / 02:12 AM IST
ఎన్నికల తాయిలాలు : డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్..రూ. 10వేలు

విజయవాడ : ఏపీ రాష్ట్రంలో డ్వాక్రా గ్రూపులపై సీఎం చంద్రబాబు నాయుడు నజర్ పెట్టారు. ఎన్నికల సమయంలో వీరిని ఆకట్టుకొనేందుకు పలు చర్యలను ఏపీ ప్రభుత్వం తీసుకొంటోంది. మహిళల ఒక్కొక్కరికి రూ. 10వేల ఆర్థిక సాయం, ఒక స్మార్ట్ ఫోన్ అందించాలని బాబు డిసైడ్ అయ్యారు. అయితే…రూ. 10వేల ఆర్థిక సాయంపై అధికారిక ప్రకటన వెల్లడించలేదు. జనవరి 26వ తేదీన డ్వాక్రా గ్రూపులతో భారీ బహిరంగసభ ఏర్పాటు చేసి ఈ నిర్ణయాన్ని వెలువరించాలని బాబు నిర్ణయించారు. ప్రస్తుతం సమాచార మార్పిడిలో స్మార్ట్ ఫోన్ కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో డ్వాక్రా గ్రూపులకు ఫోన్ అందిస్తే బాగుంటుందని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. డ్వాక్రా గ్రూపుల విషయంలో కేంద్రం అనుకూలంగా స్పందించి ఉంటే..మరిన్ని చర్యలు తీసుకొనే అవకాశం ఉండేదని అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కానీ ఎన్నికల సమయంలో బాబు సర్కార్ ఇలాంటి నిర్ణయాలు తీసుకొంటోందని…గతంలో ఉన్న బకాయిలే ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని విపక్షాలు దుయ్యబడుతున్నాయి. కేవలం ఇవన్నీ ప్రకటనలకే పరిమితమౌతాయని విమర్శలు గుప్పిస్తున్నారు.