ఘోరం : ఆస్తి కోసం..తమ్ముడి తల నరికేసిన అన్న

  • Published By: veegamteam ,Published On : November 23, 2019 / 06:48 AM IST
ఘోరం : ఆస్తి కోసం..తమ్ముడి తల నరికేసిన అన్న

ఆస్తి కోసం తోడబుట్టిన తమ్ముడిని చంపేశాడు ఓ అన్న. తమ్ముడి తల నరికి పొలంలో పడేశాడు. కొంతకాలంలో ఆస్తి కోసం అన్నదమ్ములిద్దరి మధ్యా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆస్తి దక్కించుకోవటానికి అన్న రామాంజనేయులు తమ్ముడి తల నరికివేసిన ఘటన అనంతపురం జిల్లా శనగల గూడూరులో కలకలం సృష్టించింది. 

వివరాల్లోకి వెళితే.. రామాంజనేయులుకి మరో ఇద్దరు సోదరులు ఉన్నారు. వీరి ముగ్గురికి తల్లిదండ్రులు సమానంగా తలా ఐదు ఎకరాల పొలం పంచి ఇచ్చారు. తరువాత రామాంజనేయులు తమ్ముడు తన ఐదు ఎకరాలను అన్నకు కౌలుకు ఇచ్చాడు. కానీ ఇటీవల అన్నదమ్ములిద్దరికి కౌలు విషయంలో గొడవలు జరుగుతున్నాయి. దీంతో తమ్ముడు తన పొలాన్ని వేరే వారికి కౌలుకు ఇచ్చాడు. దీంతో అన్న రామాంజనేయులు తనకు కాకుండా వేరే వ్యక్తులకు పొలం ఎలా ఇస్తావంటూగొడవకు దిగాడు. నా పొలం నా ఇష్టమొచ్చినవారికి ఇచ్చుకంటాను నీకెందుకు అన్నాడు తమ్ముడు.

ఈక్రమంలో..తమ్ముడిపై ఆగ్రహం పెంచుకున్న రామాంజనేయులు శనివారం (నవంబర్ 23) ఉదయాన్ని పొలానికి నీరు పెట్టుకునే విషయంపై మరోసారి తమ్ముడితో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్యా ఘర్షణ జరిగింది. దీంతో విచక్షణ కోల్పోయిన రామాంజనేయులు వేట కొడవలితో తమ్ముడిని తల నరేశాడు. మొండెం నుంచి తల వేరుగా తెగి పడిపోయింది. అనంతరం భయపడిన రామాంజనేయులు పరారయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న బంధువులు..స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దీంట్లో భాగంగా..పరారీలో ఉన్న రామాంజనేయులు కోసం గాలిస్తున్నారు. 

సమాజంలో మానవత్వం మంటగలిసిపోతోంది. ‘మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే’నని ఓ తత్వవేత్త చెప్పిన మాటలు నిజమని నిరూపిస్తున్నాయి ఇటువంటి ఘోరమైన ఘటనలు. ఆస్తుల కోసం కన్నవారిని కడతేరుస్తున్నారు. తోడబుట్టినవారిని తుదముట్టిస్తున్నారు. ఆస్తులే ముఖ్యంగా రక్త సంబంధాలు..మానవ సంబంధాల విలువలు కాలగర్భంలో కలిసిపోతున్నాయా? అనే ఆందోళన కలుగుతోంది ఇటువంటి ఘోరాలతో.