కె.ఏ.పాల్కు షాక్.. ఊపిరి పీల్చుకున్న వైసీపీ
ఒకే రకమైన గుర్తులతో పార్టీలకు వచ్చే తిప్పలు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో ట్రక్కు, కారు గుర్తుల మధ్య ఇటువంటి ఇబ్బంది తలెత్తడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆ గుర్తును తొలగించింది. ఇప్పుడు అదే మాదిరిగా తమకు ఇబ్బంది కలుగుతుందనే భావనతో వైసీపీ చేసుకున్న అభ్యర్ధనను కేంద్ర ఎన్నికల సంఘం పరిగనలోకి తీసుకుంది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్ పార్టీ గుర్తు హెలికాప్టర్ను పక్కనపెట్టింది. ఆయన హెలికాప్టర్ గుర్తు తమ పార్టీ గుర్తు ఫ్యాన్ను పోలి ఉండడంతో ఎన్నికల్లో తమకు నష్టం జరిగే అవకాశం ఉందని, అందువల్ల గుర్తును తొలగించాలంటూ వైసీపీ మాజీ ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ పాల్కు నోటీసులు జారీ చేసింది.
అయితే వైసీపీ తన గుర్తును తొలగించేందుకు కుట్ర చేస్తుందని, పంచంలో ఎక్కడైనా హెలికాప్టర్, ఫ్యాన్ ఒకేలా ఉండడం చూశామా? అంటూ పాల్ ప్రశ్నించారు. రెండు గుర్తుల మధ్య తేడాను ప్రజలు స్పష్టంగా గుర్తించగలరని వైసీపీ దురుద్దేశంతో గుర్తుపై ఫిర్యాదు చేసిందంటూ ఆరోపించారు. అయితే పాల్ ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసులకు ఇచ్చిన సమాధానం సరిగ్గా లేకపోవడంతో ఈసీ గుర్తును పక్కన పెడుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో వైసీపీ ఊపిరి పీల్చుకుంది. ఓట్లు ఎక్కడ మిస్ అవుతాయో అని ఆందోళనలో ఉన్న వైసీపీ ఈసీ నిర్ణయంపై ఆనందం వ్యక్తం చేస్తుంది.