భార్య కళ్లెదుటే లారీ డ్రైవర్ దారుణ హత్య
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో లారీ డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. గుడారిగుంటలో తన ఇంట్లో ఉన్న నక్కా బ్రహ్మానందం అనే వ్యక్తిని దుండగులు కత్తులతో నరికి చంపారు. ముఖానికి మాస్క్లు ధరించి భార్య కళ్ళెదుటే దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. క్లూస్ టీం డాగ్ స్క్వాడ్ను రపించిన పోలీసులు విచారణ ప్రారంభించారు.
తన కళ్లెదుటే భర్తను దుండగులు దారుణంగా హత్య చేయటంతో ఆమె షాక్ కు గురైంది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే దారుణం జరిగిపోయింది. బ్రహ్మానందాన్ని హత్య చేసిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు పరారీలో ఉన్న దండగుల కోసం గాలిస్తున్నారు. బ్రహ్మానందాన్ని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? పాత క్షక్షలతోనే ఈ దారుణానికి పాల్పడ్డారా? అనే కోణంలో దర్యాప్తును కొనసాగిస్తున్నారు.