వెడ్డింగ్ కార్డ్‌పై సేవ్ అమరావతి: రైతులకు ఎన్ఆర్ఐ సపోర్ట్

  • Published By: vamsi ,Published On : February 1, 2020 / 05:43 PM IST
వెడ్డింగ్ కార్డ్‌పై సేవ్ అమరావతి: రైతులకు ఎన్ఆర్ఐ సపోర్ట్

కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పొన్నవరం గ్రామానికి చెందిన జాస్తి సురేష్ అమరావతి రైతుల ఉద్యమానికి వినూత్న రీతిలో మద్దతు ప్రకటించాడు.​ తన వివాహ శుభలేఖపై సేవ్​ అమరావతి.. సేవ్​ ఫార్మర్స్​ అని ప్రింట్ చేసి తన వంతుగా అమరావతి నిరసనలకు సపోర్ట్ చేశారు. కెనడాలో ఉద్యోగం చేస్తున్న సురేష్.. తన వంతు కృషిగా తోటి ఉద్యోగులతో కలిసి రాజధాని రైతుల కోసం విరాళాలు సేకరించటంతో పాటు.. అమరావతి కోసం చేసిన నిరసనల్లోనూ పాల్గొన్నారు.

రైతుల ప్రయోజనాలు, సమస్యలు దృష్టిలో పెట్టుకుని, ఓ రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా.. తనను చదివించడానికి తన తండ్రి చేసిన కష్టాన్ని గుర్తు చేసుకుని ఈ మేరకు కార్డుపై ‘సేవ్​ అమరావతి.. సేవ్​ ఫార్మర్స్​’ అని ముద్రించానని వెల్లడించారు. ఇటీవల నిర్వహించిన తన వివాహ నిశ్చయ కార్యక్రమానికి విచ్చేసిన రాజధాని రైతులు కనీసం భోజనం చేయకుండా వెళ్లిపోవడం బాధవేసిందని సురేష్ అన్నారు. 

అందుకే వివాహ ఆహ్వానలేఖ ‘అమరావతిని రక్షించండి… రైతులను కాపాడండి’ అని ముద్రించినట్లు చెప్పారు. తన వివాహ కార్డు ద్వారా రైతుల ఆవేదన ప్రతీ ఒక్కరికి తెలిసే అవకాశం ఉందని సురేష్ తెలిపారు. రైతుల ఇబ్బందులను దగ్గర నుంచి చూసిన తన కుమారుడు రైతులకు మద్దతుగా శుభలేఖపై ఇలా ముద్రించడం సంతోషంగా ఉందని సురేష్ తల్లి చెబుతున్నారు.