కరోనా వేళ : 2021 హరిద్వార్ కుంభమేళా నిర్వహణలో ప్రత్యేక ఏర్పాట్లు షురూ..
కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని 2021లో ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో నిర్వహించే కుంభమేళాలో మార్పులు చేర్పులు చోటుచేసుకోనున్నాయి. డిసెంబరు నాటికి కుంభమేళా పనులను పూర్తి చేసేలా ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రణాళికలు వేయాలని నిర్ణయించింది. 2021 కుంభమేళా పనుల గురించి చర్చించేందుకు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మదన్ కౌశిక్ అధికారులతో సమావేశమయ్యారు. కుంభమేళా కోసం అన్ని ఏర్పాట్లను సమయానికన్నా ముందుగానే పూర్తి చేయాలని సూచించారు.
ముఖ్యంగా పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, చెత్తాచెదారం వంటి వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలని..కుంభమేళాకు వచ్చే భక్తులకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని, పార్కింగ్, స్నానఘాట్లు..తాగునీటి సౌకర్యం..మెడికల్ క్యాంపులు వంటి ఏర్పాట్లను చాలా జాగ్రత్తగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే ఆహ్లాదకరమైన వాతావరణ ఉట్టిపడేలా హరిద్వార్ సుందరీకరణకు ప్రత్యేక ప్రాధాన్యతనివ్వాలని కోరారు. గోడలపై పెయింటింగ్స్ లైటింగ్ విషయంలో తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.అలాగే ప్రతీ మెడికల్ క్యాంప్ వద్దా..మాస్కులు..శానిటైజర్లు వంటివి కచ్చితంగా అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. నగరంలోని రోడ్లు మరమ్మత్తులు వంటివి జరగాలని ఆదేశించారు,
కుంభ ప్రాంత విస్తీర్ణం
పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మదన్ కౌశిక్ మాట్లాడుతూ..ప్రతీ సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా కుంభమేళా విస్తీర్ణం 700 హెక్టార్లలో ఉంటుందని చెప్పారు. కుంభ్ ప్రాంత వైశాల్యాన్ని ఈసారి 1700 హెక్టార్లకు పెంచాలని ప్రభుత్వం ప్రణాళిక వేసింది. కానీ కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం మారిన పరిస్థితుల కారణంగా, కుంభ్ ప్రాంతం యొక్క వైశాల్యాన్ని మునుపటిలాగా 700 హెక్టార్లలో ఉంచాలని నిర్ణయించారు. కుంబ్ ప్రాంతం యొక్క పరిధిని మునుపటిలాగే ఉంచామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మదన్ కౌశిక్ తెలిపారు.