జర భద్రం : 48 గంటల్లో భారీ వర్షాలు
మండు వేసవిలో తమిళనాడు, పుదుచ్చేరిలకు ఇప్పటికే వాతావరణ శాఖ తుఫాన్ హెచ్చరికలను జారీ చేసింది. రాబోయే 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
ఇక తెలంగాణ, కోస్తాంధ్రలో కూడా ఇవాళ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. హిందూమహా సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో శ్రీలంకకు ఆగ్నేయంగా దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది రానున్న 36 గంటల్లో బలపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కాగా తమిళనాడు, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలలో 24వ తేదీ నుంచి వర్షాలు కురుస్తున్నాయి.