Drinking Water Corona : తాగునీటిలో కరోనా వైరస్ ప్రమాదకరం కాదు

తాగేనీటిలోనూ కరోనా రెండు రోజులపాటు బతికే ఉంటుందని సెంటర్‌ ఫర్‌ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ) డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్ర తెలిపారు. నీటి ఉష్ణోగ్రత, అందులోని ఇతర పదార్థాలపై ఆధారపడి వైరస్‌ బతికి ఉంటుందని అన్నారు.

Drinking Water Corona : తాగునీటిలో కరోనా వైరస్ ప్రమాదకరం కాదు

Drinking Water Corona

Corona virus in drinking water : తాగేనీటిలోనూ కరోనా రెండు రోజులపాటు బతికే ఉంటుందని సెంటర్‌ ఫర్‌ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ) డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్ర తెలిపారు. నీటి ఉష్ణోగ్రత, అందులోని ఇతర పదార్థాలపై ఆధారపడి వైరస్‌ బతికి ఉంటుందని అన్నారు. కొవిడ్‌ వైరస్‌పై అవగాహన కల్పించేందుకు జూమ్‌లో శనివారం ఆయన సీసీఎంబీలో కొవిడ్‌ వైరస్‌ జన్యుక్రమ ఆవిష్కరణలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్న దివ్యతేజ్‌, కార్తీక్‌లతో కలిసి మాట్లాడారు. 4 నుంచి 12 డిగ్రీల ఉష్ణోగ్రతల వరకు చల్లని నీటిలో వైరస్‌కు ఇన్‌ఫెక్షన్‌ కలిగించే సామర్థ్యం ఉంటుందన్నారు. వేడినీళ్లలో 65 డిగ్రీల వద్ద వైరస్‌ నిమిషాల వ్యవధిలోనే చనిపోతుందని చెప్పారు.

నీటిలోని వైరస్‌ ఒక్కటే ఇన్‌ఫెక్షన్‌ కలిగించలేదు.. అది శరీరంలోకి వెళ్లాలంటే ప్రత్యేకించి కొన్ని వందల కణాలు కావాల్సి ఉంటుందని చెప్పారు. అయితే తాగిన నీరు నేరుగా పొట్టలోకి వెళుతుంది కాబట్టి ప్రమాదమేమి లేదన్నారు. తాగునీటి ద్వారా కొవిడ్‌ వ్యాప్తి చెందిన కేసులు మనదేశంలో ఎక్కడా నమోదు కాలేదు.. కాబట్టి అదేమంత ఆందోళన కలిగించే విషయం కాదని తెలిపారు. ముందుజాగ్రత్తగా వేడి చేసిన గోరు వెచ్చని నీటిని, వేడి పదార్థాలనే తీసుకోవడం మంచిదని సూచించారు. ప్రస్తుతానికి మనుషుల నుంచి మనుషులకు, గాలి ద్వారా మాత్రమే వైరస్‌ వ్యాప్తి చెందుతోందని పేర్కొన్నారు.

కరోనా వైరస్‌ ఎప్పటికి అంతమవుతుందనేది చెప్పలేమని తెలిపారు. అందరూ టీకాలు వేయించుకోవడం, జాగ్రత్తలు పాటించడం ద్వారా రెండు నెలల్లో మహమ్మారి ప్రభావాన్ని తగ్గించగలుగుతామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఔషధాలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. క్లినికల్‌గా చెప్పాలంటే మొదటి వేవ్‌తో పోలిస్తే కొవిడ్‌ రెండో ఉద్ధృతిలో పెద్ద మార్పులేమీ లేవని… అవే లక్షణాలు, మరణాల రేటు కూడా అదే విధంగా ఉందన్నారు.

ఈసారి వేగంగా వ్యాపిస్తుందని, పిల్లలకు ఎక్కువగా సోకుతుందనే ప్రచారం జరుగుతోందని.. దీని గురించి చెప్పడానికి కచ్చితమైన అధ్యయనాలు లేవన్నారు. పెళ్లిళ్లు, పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని తెలిపారు. జనసమ్మర్ధం ఉండే ప్రదేశాలకు వెళ్లవద్దని సూచించారు. గాలి, వెలుతురు లేని గదుల్లో ఎక్కువ సేపు గడపొద్దన్నారు. దోమల ద్వారా వైరస్‌ వ్యాప్తి జరగదని స్పష్టం చేశారు.