Biryani Rate Hike : బిర్యానీ ఆర్డర్ చేస్తే..బిల్లు చూసి గుండెలు బేజారే..!
Biryani rate hike With lock down effect : హైదరాబాదీ బిర్యానీ అంటే నోరు ఊరిపోతుంది. విదేశాలనుంచి వచ్చినవారు హైదరాబాద్ బిర్యానీ తినందే వెళ్లరు అంటే అతిశయోక్తి కాదు. అంత టేస్ట్ తో హైదరాబాద్ బిర్యానీ ఊరిస్తుంది. హైదరాబాద్లో బిర్యానీ బిజినెస్ విపరీతంగా ఉంటుంది. ముఖ్యంగా లాక్డౌన్ వల్ల మరింత గిరాకీ పెరిగింది. మధ్యాహ్నం నుంచి రెస్టారెంట్లు, హోటళ్లు బంద్ అవుతుండడంతో చాలా మంది ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుని మరీ ఇంటికి తెప్పించుకుని లొట్టలేసుకుంటూ తింటున్నారు. ఈక్రమంలో లాక్ డౌన్ పేరుతో బిర్యానీ ధరలకు రెక్కలొచ్చాయి. రెస్టారెంట్లు అధికంగా బిర్యానీ ధరల్ని పెంచేశారు.
ట్యాక్సులు..డెలివరీ చార్జీలు అంటూ బిర్యానీల బిల్లులు పెంచేస్తున్నారు. దీంతో బిర్యానీ తినాలనే కోరికతో ఆర్డర్ చేసుకుంటే వచ్చిన భిల్లు చూస్తే మాత్రం గుండెలు బేరారెత్తిపోతున్నాయి. అదనంగా పన్నులు వేస్తూ వినియోగదారుల నుంచి దోపిడీ చేస్తున్నారు వ్యాపారులు. కొత్తగా హ్యాండ్లింగ్, ప్యాకేజింగ్ ఛార్జీల పేరుతో వసూళ్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తికి హోటల్కు వెళ్లి బిర్యానీ తినటం అలవాటు. బిర్యానీ అంటే అంత ఇష్టం మరి. దానికి బిల్లు రూ.265 చెల్లించేవాడు లాక్ డౌన్ లేని సమయంలో. కానీ లాక్ డౌన్ తో హోటల్ కెళ్లి తిని ఇంటికి వచ్చేసరికి లాక్ డౌన్ సమయం దాటిపోతుంది.దీంతో రిస్క్ ఎందుకులే అని ఆర్డ్ చేసినమరీ తెప్పించుకున్నాడు. గతంతో రూ.265 ఉన్న మటన్ బిర్యానీ ధర ఒక్కసారిగా దాదాపు డబుల్ అయిపోయింది.
లాక్ డౌన్ వల్ల హోటల్ కు వెళ్లికుండా ఆన్లైన్లో ఆర్డర్ చేయాలనుకున్నాడు. రూ.405గా రేటు చూపించింది. అంతేకాదండోయ్..బిర్యానీ డెలివరీకి అదనంగా మరో రూ.22, అంతేకాదు.. ఇంకా ఇతర ఛార్జీల కింద రూ.40. మొత్తం బిల్లు రూ.467 కట్టాల్సి వచ్చింది. రెస్టారెంట్ (ప్యాకేజ్ చార్జీలు, జీఎస్టీలు, డెలివరీ చార్జీలు) మొత్తం అదనంగా మొత్తం రూ.202 చెల్లించుకున్నాడు. కేవలం బిర్యానీకి మాత్రమే కాదు ఏ ఇతర ఆహార పదార్థాలకు కూడా ప్యాకేజింగ్ ఛార్జీలు, పన్నులు అంటూ వసూళ్ల మీద వసూళ్లు చేసి వినియోగదారుల జేబులు ఖాళీ చేస్తున్నారు లాక్ డౌన్ పేరుతో.
అదనపు వసూళ్లకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలను ప్రభుత్వం రూపొందించకపోవడంతో హోటళ్లు, రెస్టారెంట్లు ఇటువంటి దోపిడీకి పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇటువంటి వసూళ్లకు సంబంధించి వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చు. బిల్లులు అధికంగా వేస్తే కస్టమర్లు వెంటనే వినియోగదారుల మండలి లేక తూనికలు కొలతలు, జిల్లా వినియోగదారుల కమిషన్లో ఫిర్యాదు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇటువంటి వసూళ్ల మీద కచ్చితంగా ఫిర్యాదు చేయాల్సిన అవసరం చాలా ఉంది. లేదంటే ఇది ఏఒక్కరికో కాదు..అందరికీ ఇటువంటి అదనపు చార్జీల భారం తప్పదు.