Harish Rao Thanneeru : నమ్మి ఓట్లు వేస్తే నట్టేట ముంచారు, తెలంగాణకు కేసీఆరే శ్రీరామరక్ష- హరీశ్ రావు

కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి. హామీల అమలు కోసం అసెంబ్లీలో గట్టిగా కొట్లాడాలంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపించండి.

Harish Rao Thanneeru : నమ్మి ఓట్లు వేస్తే నట్టేట ముంచారు, తెలంగాణకు కేసీఆరే శ్రీరామరక్ష- హరీశ్ రావు

Harish Rao Thanneeru : కాంగ్రెస్, బీజేపీలపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఒకరు మతం పేరుతో, మరొకరు రిజర్వేషన్ల పేరుతో ఓట్ల కోసం వస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయ్యిందన్నారు. మహాలక్ష్మి ద్వారా నెలకు 2500 ఇస్తామని చెప్పి మహిళలను మోసం చేశారని మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా హత్నోర మండలములో నిర్వహించిన రోడ్ షోలో మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

”దొంగలు కొందరు కాంగ్రెస్ లో కలిశారు. తులం బంగారం ఇస్తామని చెప్పి.. ఉన్న కళ్యాణలక్ష్మి బంద్ చేశారు. తెలంగాణలో లక్ష తులాల బంగారంకు కాంగ్రెస్ బాకీ పడింది. కేసీఆర్ కిట్ కుడా బంద్ అయ్యింది. పెన్షన్ 4వేలు ఇస్తామని వృద్ధులను మోసం చేశారు. రైతులకు ఎకరానికి 15000 ఇస్తానని మాట తప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో రైతు బంధు కుడా అందరికీ ఇవ్వలేదు. పంట కోతకు వచ్చినా ఇంకా రైతుబంధు ఇవ్వలేదు.

డిసెంబర్ 9న 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి చేయలేదు. రైతులకు వరికి 500 బోనస్ ఇస్తామని అబద్ధాలు చెప్పారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లు వేస్తే ప్రజలను నట్టేట ముంచారు. హామీల అమలు కోసం అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ప్రశ్నించే గొంతుక బీఆర్ఎస్ ని గెలిపించండి. మే 13న గుంపు మేస్త్రి గువ్వ గుయ్ మనాలి.

పదేళ్ళ బీజేపీ పాలనలో ప్రజల కోసం చేసిందేమీ లేదు. పదేళ్ళ పాలనలో బీజేపీ ధరలు పెంచడం తప్ప ఏమీ చేయలేదు. బీఆర్ఎస్ పేదల పార్టీ. కేసీఆర్ ను ప్రజలు కాపాడుకోవాలి. హామీల అమలు కోసం ప్రశ్నించినందుకు కేసీఆర్ పై.. రేవంత్ రెడ్డి అహంకారంతో ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళకు కళ్లు నెత్తిలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లతో బుద్ది చెప్పాలి. కాంగ్రెస్ పార్టీని భూమి మీదకు తీసుకురావాలి.

బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు మాటలు నమ్మద్దు. బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచి ప్రజలపై భారం మోపింది. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల వారు ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ మెడలు వంచేది కేవలం బీఆర్ఎస్ మాత్రమే. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల వారిని మోసం చేసింది. కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి. హామీల అమలు కోసం అసెంబ్లీలో గట్టిగా కొట్లాడాలంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపించండి.

ముస్లిం సోదరులు ఆలోచించండి. రేవంత్ రెడ్డి బీజేపీతో కలిసి పని చేస్తున్నారు. తెలంగాణ పౌరుషానికి నిజమైన ప్రతీక కేసీఆర్ మాత్రమే. కేసీఆర్ మాత్రమే తెలంగాణకు శ్రీరామరక్ష. కాంగ్రెస్, బీజేపీలను ఓడించి పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి. భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీదే. కార్యకర్తలు అధైర్య పడొద్దు. మెదక్ ఎంపీగా బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామి రెడ్డిని గెలిపించండి” అని హరీశ్ రావు అన్నారు.

మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామి రెడ్డి..
మెదక్ పార్లమెంటు ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించండి. బీజేపీ పార్టీ అభ్యర్థి రఘునందన్ రావును దుబ్బాక ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించారు. మెదక్ ప్రాంత అభివృద్ధి కోసం పార్లమెంటులో కొట్లాడతాను. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న యువత కోసం ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి శిక్షణ ఇప్పిస్తాను. స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసి.. జాబ్ మేళాలు నిర్వహించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాము. ట్రస్ట్ ఏర్పాటు చేసి నిరుపేదల పిల్లల చదువుల కోసం ఫీజులు కట్టి సాయం చేస్తాను.

Also Read : సీఎం రేవంత్‌కు మరోసారి నోటీసులు ఇచ్చే యోచనలో ఢిల్లీ పోలీసులు