Gold mining: అనంతపురంలో 2దశాబ్ధాల తర్వాత బంగారు గనుల తవ్వకానికి అనుమతులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో అనేక ప్రాంతాల్లో బంగారు గనులు ఉన్నాయి.
Gold mining: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో అనేక ప్రాంతాల్లో బంగారు గనులు ఉన్నాయి. దాదాపు రెండు దశాబ్దాల విరామం తరువాత, రామగిరి మరియు భద్రంపల్లె బంగారు క్షేత్రాలలో బంగారు మైనింగ్ తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమైంది భారత గనులశాఖ. అనంతపురం జిల్లాలో దాదాపు 16 టన్నుల బంగారు నిల్వ గనులు ఉన్నట్లుగా భారత భూగర్భశాఖ గుర్తించింది.
ఇక్కడ 10 ప్రదేశాలలో బంగారు నిక్షేపాల కోసం ప్రైవేట్ ఏజెన్సీలను ఏర్పాటు చేస్తారు. భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ బంగారు గనిని గత సంవత్సరం కర్నూలు జిల్లాలోని జొన్నగిరి వద్ద జియోమీసోర్కు కేటాయించారు. ఇక్కడ భూ సేకరణ పూర్తవుతోంది. ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు.
ఇటీవల అనంతపురం జిల్లాలో సర్వే నిర్వహించిన గనులు, భూగర్భ శాఖ 97.4 చదరపు కిలోమీటర్ల పరిధిలో 16 టన్నుల బంగారు నిల్వలను గుర్తించింది. జిల్లాలోని 10 వేర్వేరు ప్రాంతాల్లో గనులను గుర్తించింది. రాయగిరి సమీపంలో గతంలో భారత్ గోల్డ్మైన్స్ లిమిటెడ్కు గనులు ఉండేవి. అయితే, 2001 నుంచి గనుల తవ్వకాలను నిలిపివేశారు. ఇప్పుడు ఈ గనులకు సమీపంలో మరో రెండు ప్రాంతాల్లో, రొద్దం మండలంలోని బొక్సంపల్లిలోని రెండు ప్రాంతాల్లో, కదిరి మండలంలోని జౌకుల పరిధిలో 6 ప్రాంతాల్లో బంగారు గనులు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు.
ఈ పది ప్రాంతాల్లో 50 మీటర్ల నుంచి దిగువకు వెళ్లే కొద్దీ బంగారు నిల్వలు ఉన్నట్టు గుర్తించారు. టన్నుమట్టిలో నాలుగు గ్రాముల బంగారం ఉంటుందని, జౌకులలోని ఆరు ప్రాంతాల్లో కలిపి మొత్తంగా 10 టన్నులు, రామగిరిలో నాలుగు టన్నులు, బొక్సంపల్లిలో రెండు టన్నులు.. ఇలా మొత్తంగా 16 టన్నుల బంగారం నిల్వలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. గనులు ఉన్నట్టుగా గుర్తించిన ప్రాంతాల్లో ఒక టన్ను మట్టిలో నాలుగు గ్రాముల బంగారం ఉందని గనుల శాఖ స్పష్టం చేసింది. త్వరలోనే తవ్వకాలకు లైసెన్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు గనులశాఖ చెబుతోంది.