Captains: కోహ్లీనే కాదు.. కెప్టెన్లుగా ఐపీఎల్లో ట్రోఫీ అందుకోలేకపోయిన ఇండియన్ లెజెండ్స్ వీళ్లే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్ నుంచి కెప్టెన్ విరాట్ కోహ్లీ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బయటకు వచ్చేసింది.
Captains: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్ నుంచి కెప్టెన్ విరాట్ కోహ్లీ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బయటకు వచ్చేసింది. యూఏఈలో సెకండ్ సీజన్కు ముందే, కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించగా.. ఎలిమినేటర్లో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోయిన తర్వాత ఐపీఎల్లో కెప్టెన్గా కోహ్లీ శకం ముగిసినట్లుగా అయ్యింది.
దీంతో, కెప్టెన్గా ఐపీఎల్ ట్రోఫీ గెలవాలనే విరాట్ కల కూడా అసంపూర్తిగానే మిగిలిపోయింది. విరాట్ కోహ్లీ మాదిరిగానే మరికొంతమంది ఇండియన్ లెజెండ్ క్రికెటర్లు ఐపీఎల్ కెరీర్ను నిరాశగా ముగించారు. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ వంటి భారత దిగ్గజ ఆటగాళ్లు తమ క్రికెట్ కెరీర్లో ఐపీఎల్ టీమ్ ట్రోఫీని అందుకోలేకపోయారు.
అయితే, విరాట్ కోహ్లీ పేరు ఈ లిస్ట్లో అగ్రస్థానంలో ఉంటుంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ చాలా ఏళ్లుగా RCB కెప్టెన్గా ఉన్నారు. ఫ్రాంచైజ్ కూడా కోహ్లీపై చాలాకాలంగా నమ్మకం ఉంచింది. అయితే, ఆటగాడిగా ప్రాంచైజ్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నా కూడా ట్రోఫీని మాత్రం గెలవలేకపోయాడు కోహ్లీ. కోహ్లీ తన కెరీర్లో మొత్తం 140 మ్యాచ్లకు కెప్టెన్గా చేశారు.
అనుభవజ్ఞుడైన వీరేంద్ర సెహ్వాగ్ పేరు రెండవ స్థానంలో ఉంది. ఢిల్లీ తరపున సెహ్వాగ్ 52 మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించాడు. కానీ ట్రోఫీని అందుకోలేకపోయాడు. లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా 51 మ్యాచ్లలో ముంబై ఇండియన్స్కి కెప్టెన్గా వ్యవహిరించినా ఐపీఎల్ ట్రోఫీని ఒక్కసారి కూడా గెలవలేకపోయారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన రాహుల్ ద్రవిడ్ IPL కెప్టెన్సీ ట్రోఫీ అందుకోకుండానే తన కెరీర్ని ముగించారు. మొత్తం 48 మ్యాచ్లకు కెప్టెన్గా ఉన్న రాహుల్ ద్రవిడ్ 34మ్యాచ్లు రాజస్థాన్ రాయల్స్ తరపున, 14 మ్యాచ్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడారు.