ప్రియాంక రెడ్డి హత్యపై భావోద్వేగం: మహేష్ బాబు కవిత
ప్రియాంకారెడ్డి హత్యాచారం ఘటన.. దేశవ్యాప్తంగా కలకలం రేపింది. సంచలనం రేపిన ఈ ఘటనపై తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా సెలబ్రిటీలు సైతం డాక్టర్ ప్రియాంక రెడ్డి ఘటనపై స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సూపర్ స్టార్, ప్రిన్స్ మహేష్ బాబు స్పందించాడు. బాధిత కుటుంబానికి సానుభూతి తెలుపుతూ.. ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు.
హత్యోదంతంపై యావత్తు దేశం భగ్గుమంటున్న సమయంలో ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు మహేష్ బాబు. మరిన్ని కఠిన చట్టాలు తేవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు “రోజులు గడుస్తూనే ఉన్నాయి. పరిస్థితులు మాత్రం మారడం లేదు. ఒక సమాజంగా మనం విఫలమవుతున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నా విన్నపం ఏంటంటే.. ఇలాంటి భయంకరమైన నేరాలను అరికట్టడానికి మరిన్ని కఠిన చట్టాలు తేవాల్సిన అవసరం ఉంది. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. అంతా కలిసి మహిళలకు అండగా నిలుద్దాం.. భారతదేశాన్ని సురక్షితంగా మార్చుదాం.” అంటూ ట్వీట్ చేశారు.
కేటీఆర్, ప్రధాన మంత్రి కార్యాలయాన్ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసిన మహేష్. సామాజిక మాధ్యమాల్లో తన గొంతుతోనే ఓ కవితను పంచుకున్నారు.
ఎవరి కళ్లలో సంస్కారం సూర్యకాంతిలా మెరుస్తుందో..
ఎవరి మాట మన్ననగా ఉంటుందో..
ఎవరి మనసు మెత్తగా ఉంటుందో..
ఎవరి ప్రవర్తన మర్యాదగా ఉంటుందో..
ఎవరికి ఆడవాళ్లంటే హృదయంలో అభిమానం.. సమాజంలో గౌరవం ఉంటాయో..
ఎవరు వాళ్ల శరీరానికి, మనసుకి, ఆత్మకి విలువిస్తారో..
వారి ఆత్మగౌరవానికి తోడుగా నిలుస్తారో..
ఎవరు మగువ కూడా మనిషే అని ఒక్క క్షణం కూడా మరిచిపోరో..
స్త్రీకి శక్తి ఉంది.. గుర్తింపు ఉంటుంది.. గౌరవం ఉండాలని ఎవరు మనస్ఫూర్తిగా అనుకుంటారో..
ఎవరికి దగ్గరగా ఉంటే.. వాళ్లకి ప్రమాదం దూరంగా పారిపోతుందని నమ్మకం ఉంటుందో..
అలాంటి వాడు స్త్రీకి నిజమైన స్నేహితుడు, సహచరుడు, ఆత్మీయుడు..
ఒక్క మాటలో చెప్పాలంటే.. వాడే మగాడు..
అంటూ మహేశ్ మహేష్ గొంతుతో ఉన్న ఈ సందేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
My heartfelt condolences to the families of the girls. Your pain is irreversible! Let’s come together to give justice to all the women and young girls of our country… Let’s make India safe!!#JusticeforPriyankaReddy #StopRapes #SaveHer
— Mahesh Babu (@urstrulyMahesh) December 1, 2019