Kerala : డ్రగ్స్ కేసులో నిందితుడైన ప్రముఖ నటుడు ఆత్మహత్య
ప్రముఖ మలయాళ నటుడు ఎన్డీ ప్రసాద్(43) ఆత్మహత్య చేసుకున్నారు.
Kerala : ప్రముఖ మలయాళ నటుడు ఎన్డీ ప్రసాద్(43) ఆత్మహత్య చేసుకున్నారు. కొచ్చి సమీపంలోని కలమస్సేరి లోని తన ఇంటి బయట చెట్టుకు ఉరివేసుకుని కనిపించాడు. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో అతని పిల్లలు తండ్రి మృతదేహాన్ని గుర్తించి ఇరుగు పొరుగు వారికి సమాచారం ఇచ్చారు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో, ఘటనా స్ధలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఎన్డి ప్రసాద్ పలు మలయాళ చిత్రల్లో నటించాడు. ప్రేమమ్ ఫేమ్ నవీన్ పౌల్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ హీరో బిజు చిత్రంలో ప్రసాద్ నటనకు మంచి పేరు సంపాదించారు. ఇబా, కర్మణి వంటి పలు చిత్రాల్లో ఎన్డీ ప్రసాద్ కీలక పాత్రలు పోషించారు.
ప్రసాద్కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాలతో అతను కొన్నాళ్ళుగా భార్యాపిల్లలకు దూరంగా ఉంటున్నాడు. కుటుంబ సమస్యల వల్లే ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నట్లు ఇరుగు పొరుగు వారు అందించిన సమాచారం బట్టి తెలుస్తోంది. ప్రసాద్ కొన్ని నెలలుగా డిప్రెషన్లో ఉన్నట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కాగా ప్రసాద్పై పలు క్రిమినల్ కేసులున్నట్లు తెలుస్తోంది.
2021లో ప్రసాద్ డ్రగ్స్ సేవిస్తుండగా నార్కోటిక్ డ్రగ్స్ అధికారులు అతడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అప్పుడు ఆయన దగ్గర 2.5 గ్రాముల హాషిష్ ఆయిల్, 15 గ్రాముల గంజాయి లభించింది. ఈరోజు ఉదయం పోస్టుమార్టం అనంతరం పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రసాద్ ఆత్మహత్య చేసుకోవటం కోలివుడ్లో కలకలం రేపుతోంది.
Also Read : Vikarabad : వీడిన వికారాబాద్ ఫ్యామిలీ మిస్సింగ్ మిస్టరీ