Indian Independence Movement: భారత స్వాతంత్ర ఉద్యమ సమయంలో పలు ఘట్టాలకు సంబంధించిన అరుదైన చిత్రాలు ..
1947 ఆగస్టు 15 భారతీయుల హృదయాల్లో ఎప్పుడూ చిరస్థాయిగా నిలిచిపోతుంది. కారణం.. స్వాతంత్ర్య పోరాటం సుదీర్ఘకాలం సాగిన అనంతరం బ్రిటిష్ వారు భారత్ ను వదిలి వెళ్లారు.
Indian Independence Movement: 1947 ఆగస్టు 15 భారతీయుల హృదయాల్లో ఎప్పుడూ చిరస్థాయిగా నిలిచిపోతుంది. కారణం.. స్వాతంత్ర్య పోరాటం సుదీర్ఘకాలం సాగిన అనంతరం బ్రిటిష్ వారు భారత్ ను వదిలి వెళ్లారు. ఇదే క్రమంలో భారతీయుల్లో బాధను కూడా మిగిల్చింది.. ఎందుకంటే ధైర్యవంతులైన ఎందరో పురుషులు, మహిళలు బ్రిటీష్ వారిపై పోరాడి ప్రాణాలు కోల్పోయారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో అనేక ఉద్యమాలు పురుడు పోసుకున్నాయి. ఇందుకు సంబంధించి అప్పటి పరిస్థితులను తెలిపే కొన్ని చిత్రాలు..
క్విట్ ఇండియా ఉద్యమం..
1942 ఆగస్టు 8న దేశంలో ప్రజలు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ వీధుల్లోకి వచ్చారు. అందరూ బిగ్గరగా, స్పష్టంగా క్విట్ ఇండియా అనే సందేశాన్నిచ్చారు. భారతదేశంలో పాలన సాగిస్తున్న బ్రిటీష్ పాలకులకు తమ దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ప్రజంతా ఏకతాటిపైకొచ్చి నినదించారు. క్వింట్ ఇండియా ఉద్యమంలో దేశ పౌరులనుద్దేశించి మహాత్మా గాంధీ చేసిన ప్రసంగంతో ఉద్యమం ప్రారంభమైంది. బ్రిటిష్ వారి బారి నుండి భారతదేశాన్ని విడిపించడానికి భారతీయులు ముందుకు రావాలని ఆయన కోరారు.
అబ్బాస్ త్యాబ్జీ..
స్వాతంత్ర్య సమరయోధుడు అబ్బాస్ త్యాబ్జీ మహాత్మా గాంధీకి సహచరుడు కూడా. గాంధీ అరెస్టు తర్వాత 1930లో ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్లో చదువుకున్న న్యాయవాది అయినప్పటికీ, బ్రిటీష్ వారి పట్ల గౌరవం ఉన్నప్పటికీ, అబ్బాస్ న్యాయమైన వ్యక్తి. భారత జాతీయ కాంగ్రెస్కు నాయకత్వం వహించారు. గాంధీ తన ఆత్మకథలో వ్రాసినట్లుగా.. అబ్బాస్ త్యాబ్జీ ప్రభావంతో కాంగ్రెస్ మొత్తంగా గుజరాత్ సహాయ నిరాకరణ కార్యక్రమాన్ని అంగీకరించింది.
నిరసన రూపంగా ఉపవాసం ..
స్వాతంత్య్రోద్యమ సమయంలో మహాత్మా గాంధీ మొత్తం 18 నిరాహార దీక్షలు చేశారని, ఆయన 21 రోజుల పాటు నిరాహార దీక్షలు చేశారని చెబుతారు. ఆ రోజుల్లో ఉపవాసాలు మామూలుగా ఉండేవి కావు. వారు జరుగుతున్న సంఘటనలకు వ్యతిరేకంగా అహింసాత్మక నిరసన రూపంగా భావించారు. చిత్రంలో మహాత్మా గాంధీ అటువంటి ఉపవాసం ప్రారంభంలో కనిపించారు.
కస్తూర్బా గాంధీ ..
భారతదేశాన్ని బ్రిటీష్ వారి నుండి విముక్తి చేయడానికి గాంధీ చేసిన ప్రయత్నాల సమయంలో గాంధీకి అండగా నిలిచిన కస్తూర్బా గాంధీ యొక్క ప్రస్తావన తరచుగా మనకి కనిపించదు. ఈ చిత్రం జనవరి 1922లో తీయబడింది. కుట్రకు పాల్పడినందుకు గాంధీని బ్రిటీష్ రాజ్ అరెస్టు చేయడానికి కొంతకాలం ముందు తీసిన చిత్రం కావడం విశేషం.
బొంబాయిలో నిరసనలు..
స్వాతంత్య్ర పోరాటం ఉధృతం కావడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. చిత్రంలో బొంబాయిలో (ఆధునిక ముంబై) నిరసనకారులను పోలీసులు ఎదుర్కోవడం చూడవచ్చు. ఎస్ప్లానేడ్ మైదానంలో జాతీయ కాంగ్రెస్ సమావేశాన్ని నిషేధించినప్పుడు, సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వారు తమ హక్కులను కోరుతూ నిరసనలు ప్రారంభించారు. అయితే మహిళలు, పిల్లలు సహా నిరాయుధులైన నిరసనకారులపై పోలీసులు భారీ లాఠీఛార్జి చేశారు.
రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు చేసిన సమయం
చివరి స్వాతంత్ర్య యుద్ధం లేదా 1946 నావికా తిరుగుబాటు అని కూడా పిలుస్తారు. ఈ కార్యక్రమంలో రాయల్ ఇండియన్ నేవీకి చెందిన నావికులు బ్రిటిష్ పాలనపై తిరుగుబాటు చేశారు. వారి రిక్రూట్మెంట్ సమయంలో వారికి చేసిన నెరవేరని వాగ్దానాలు, అపరిశుభ్రమైన జీవన పరిస్థితులు, దీనికితోడు జాతి వివక్షే వారి తిరుగుబాటుకు కారణాలు. ఈ కారకాలతో పాటు సహచరుల ప్రభావం కూడా ఉంది. వారి సహచరులు, ఇండియన్ నేషనల్ ఆర్మీ (INA) స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొంది. నావికాదళం కూడా తమ సంఘీభావాన్ని తెలియజేయాలని కోరుకుంది.
హరిపుర వద్ద నేతాజీ బోస్ ..
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1938లో హరిపుర కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ సంవత్సరం, భారత జాతీయ కాంగ్రెస్ ఫిబ్రవరి 19 నుండి 22 వరకు హరిపురలో సమావేశమైంది. అంతేకాదు.. ఈ సందర్భంగా 51 ఎద్దుల రథాలను అలంకరించారు. దీనికి తోడు ప్రముఖ చిత్రకారుడు నందలాల్ బోస్ ఈ సందర్భంగా ఏడు పోస్టర్లను రూపొందించగా, చిత్రనిర్మాత వాడియా హరిపుర కాంగ్రెస్ గురించి ఒక ఫీచర్ డాక్యుమెంటరీని రూపొందించారు.
సైమన్ గో బ్యాక్..
భారతదేశంలో జరుగుతున్న సంస్కరణలను చూసేందుకు 1927లో సర్ జాన్ సైమన్ అధ్యక్షతన ఒక కమిషన్ను నియమించారు. ఇది తమ నాయకత్వాన్ని అవమానించడమేనని భారతీయులు భావించారు. 1928 ఫిబ్రవరి 3న కమిషన్ భారతదేశానికి వచ్చినప్పుడు గాంధీ నాయకత్వంలో భారతీయులు తిరుగుబాటు చేసి కమిషన్ను వెనక్కి వెల్లమని కోరారు. ‘సైమన్ గో బ్యాక్’ అంటూ నినదించారు. ఆ సమయంలో ర్యాలీ నిర్వహిస్తున్న అరుదైన చిత్రం.
నిరసన యొక్క అహింసా మార్గాలు..
దేశంలోకి విదేశీ దిగుమతులు పెరగడం ప్రారంభించడంతో దేశీయ వస్తువుల విక్రయానికి, ముఖ్యంగా వస్త్రానికి ముప్పు ఏర్పడింది. భారతీయులు దిగుమతి చేసుకున్న వస్త్రాల విక్రయాలను వ్యతిరేకించడం ప్రారంభించారు, చేతితో తయారు చేసిన ఖాదీ, జాతీయ వస్త్రాలపై ఆధారపడటం ప్రారంభించారు. సెప్టెంబరు 1930లో ఇటువంటి ఒక నిరసన సమయంలో తీయబడిన చిత్రం.
విభజన ఘోరాలు ..
1947 నాటి విభజన భారతదేశంలోని బ్రిటీష్ రాజ్ రద్దుకు చిహ్నంగా ఉన్నందున దానితో విజయ స్ఫూర్తిని తెచ్చింది. అయితే ఈ క్రమంలో ఇరువైపులా కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయి. కుటుంబాల మధ్య అంతరాలతో పాటు, యుద్ధాలు, ప్రాణనష్టం, సామూహిక వలసలు కూడా ఉన్నాయి, ఇది ప్రజలను దెబ్బతీసింది. ఢిల్లీలోని శరణార్థి శిబిరంలో ఒక యువకుడు కూర్చున్న దృశ్యం చిత్రం. విభజనతో ప్రాణాలతో బయటపడిన అనేకమంది నేటికీ పడుతున్న వేదనను ఆయన ముఖం ప్రతిబింబిస్తోంది.