Hate Speech: ముస్లింలు లక్ష్యంగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యతి నర్సింగానంద్
Hate Speech: గాడ్సే దేవుడు.. గాంధీ చెత్త కుప్ప అంటూ గతంలో అనేక వివాదాస్పద వ్యాక్యలు చేసిన వివాదాస్పద మత బోధకుడు యతి నర్సింహానంద సరస్వతి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తరుచూ ముస్లింల మీద నోరు పారుసుకునే ఈయన.. మరోసారి వారిని లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘడ్ నగరంలో ఆదివారం జరిగిన హిందూమహాసభ కార్యక్రమంలో యతి నర్సింగానంద సరస్వతి మాట్లాడుతూ గన్పౌడర్ ఉపయోగించి మదర్సాలు, అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయాన్ని కూల్చివేయాలని అన్నారు.
తాజాగా యూపీలో సాగుతున్న సర్వేలో గుర్తింపులేని మదరసాలను చైనా దేశంలో లాగా గన్ పౌడరుతో పేల్చివేయాలని యతి నర్సింగానంద పిలుపునిచ్చారు. మదరసాల్లోని విద్యార్థులకు మతపిచ్చి వైరస్ సోకిందని, మతపిచ్చిని వారి మెదళ్ల నుంచి తొలగించాలని ఆయన కోరారు. మదర్సాలు, అలీఘడ్ ముస్లిం యూనివర్శిటీని పేల్చివేసి, అందులోని విద్యార్థులను డిటెన్షన్ కేంద్రాలకు తరలించి వారి మెదడుకు చికిత్స చేయాలని సూచించారు. కాగా ఈ విషయమై ఆయన మీద అలీఘడ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
గతేడాది ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో జరిగిన ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యల అనంతరం ఈయన దేశ వ్యాప్తంగా ప్రచారం అయ్యారు. ఆ సభలో ‘‘గాంధీ మోసగాడు, హిందూ వ్యతిరేకి. వాస్తవానికి గాంధీ ముస్లిం కానీ హిందూలోకి రహస్యంగా మారారు. గాంధీ, నెహ్రూలు చేసిన ద్రోహం వల్ల ఈ దేశంలో 100 కోట్ల మంది హిందువులకు తమ ఇల్లు ఇదే అని చెప్పుకోలేకపోతున్నారు. నేను గాంధీని చెత్త కుప్పతో పోలుస్తాను. నా దృష్టిలో గాడ్సే దేవుడు’’ అని వ్యాఖ్యానించారు.
అనంతరం.. ఆ కేసులో అరెస్టు అయిన విడుదలయ్యారు. విడుదల అనంతరం కూడా గాంధీపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో కోటి మంది హిందువుల హత్యాకాండకు మహాత్మాగాంధీ బాధ్యుడని యతి ఆరోపించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను జోక్గా యతి నర్సింగానంద అభివర్ణించారు. రాహుల్ గాంధీతో జిహాదీలున్నారని అందుకే యూపీలో గెలవలేక కేరళలోని వయానడ్కు వెళ్లారని విమర్శించారు. ఇంతటితో ఆగక.. దేశ సమైక్యత గురించి రాహుల్ గాంధీకి ఆయనో సూచన చేశారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాలకు వెళ్లి ఆ దేశాలను భారత్లో కలపాలని రాహుల్కు నర్సింగానంద సూచించారు.