40 శాతం తగ్గిన వ్యర్ధాలు..లాక్ డౌన్ మంచే చేసిందిగా..

  • Published By: nagamani ,Published On : May 13, 2020 / 06:23 AM IST
40 శాతం తగ్గిన వ్యర్ధాలు..లాక్ డౌన్ మంచే చేసిందిగా..

ఒక చెడు వెనుక మంచి దాగుంటుంది. కష్టం వెనుక సుఖం వస్తుందని పెద్దలు అంటుంటారు. కరోనా వైరస్‌ తో ప్రపంచ దేశాలన్ని విలవిల్లాడుతున్నాయి. ఈ కరోనా వైరస్ రాకముందు కాలుష్యంతో పర్యావరణం కూడా విలవిల్లాడిపోయింది. కాలుష్యాన్ని భరించలేకపోతునామంటూ గంగమ్మ..భూదేవమ్మల పరిస్థితి కూడా అదే. కాలుష్యపు మరకలు కాదు..కాదు కాలుష్య భూతం ఆవహించిన ప్రకృతి మాత పరిస్థితి వర్ణనాతీతం. కానీ కరోనా పర్యారణానికి మంచే చేసింది. అదే లాక్ డౌన్ తో ప్రజలు ఇళ్లకే పరిమితం అయిపోవటంతో ప్రకృతి మాత ఊపిరి పీల్చుకుంది.  హాయిగా ఒళ్లువిరుచుకుని స్వేచ్ఛగా స్వచ్చమైన గాలిని ప్రసరింపజేసింది. ఇదంతా కరోనా కట్టడికి ప్రకటించిన లాక్ డౌన్ వల్లనే.

ఈ విషయాన్ని పర్యావరణవేత్తలు ఢంకాబజాయించి మరీ చెబుతున్నారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావటంతో చెత్త తగ్గిపోయింది. ఈ విషయాన్ని ప్రకృతికి నెలవైన కేరళ రాష్ట్రం మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది చేసిన పరిశీలనలో వెల్లడైంది. 

కేరళ రాష్ట్రంలోని తిరుచిరాపల్లి నగరంలో చెత్త ఉత్పత్తి 40 శాతం తగ్గిపోయిందని మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది పరిశీలనలో వెల్లడైంది. తిరుచిరాపల్లి నగరంలో రోజుకు 460 టన్నుల చెత్త ఉత్పత్తి అయ్యేది. చెత్త పేపర్లు, ఆహారవ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్ధాలు..ఇలా అన్నీ కలిపి 51 శాతం ఉత్పత్తి అవుతోంది.పాత టైర్లు, ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను పారిశుద్ధ్య సిబ్బంది తొలగిస్తుంటారు. తిరుచ్చి నగరంలోని శ్రీరంగం, గాంధీ మార్కెట్ తదితర ప్రాంతాలన్నీ కలిపి మార్చి 25,2020 460 టన్నుల చెత్త వచ్చేది.

కానీ  లాక్ డౌన్ వల్ల ప్రజలు బైటకు రాకపోవటంతో వ్యర్ధాలు తగ్గాయి. మార్కెట్లతోపాటు ఇళ్లలోని చెత్త తగ్గింది. గతంతో 460 టన్నుల చెత్త లభ్యమైతే  లాక్ డౌన్ సమయంలో రోజుకు 270 టన్నుల చెత్త మాత్రమే వస్తోంది. అంటే చెత్త సగానికి సగం తగ్గిపోయింది. నగరంలోని రెస్టారెంట్లు, హోటళ్లు, ఆఫీసులు మూతపడటంతో చెత్త ఉత్పత్తి తగ్గిందని ఇంజినీరు అమృతవల్లి చెప్పారు. ఇళ్లలోని చెత్తను 32 మైక్రో కంపోస్టు యార్డులకు తరలిస్తున్నామని తిరుచిరాపల్లి మున్సిపల్ అధికారులు  తెలిపారు.

ఒక్క తిరుచిరాపల్లిలోనే ఇంతభారీ స్థాయిలో చెత్త తగ్గిపోతే..దేశ వ్యాప్తంగా లెక్క వేసుకుంటూ చెత్త..ప్లాస్టిక్ వ్యర్ధాల వినియోగం ఎంత భారీ నుంచి అతి భారీ స్థాయిలో తగ్గిపోయిందో లెక్కలు వేసుకుంటే కరోనా మంచే చేసింది..లాక్ డౌన్ వల్ల మనం ఇబ్బంది పడ్డా పర్యావరణానికి మంచే చేశాం అనుకోక తప్పదు. పర్యావరణానికి మంచి చేయటం అంటే మనకు మనమే మేలు చేసుకున్నాం అని ప్రతీ మనిషి అర్థం చేసుకోవాలి. ఇకనైనా విచక్షణతో మెలిగి భావి తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేలా నడుచుకోవాలి. ఇదే ప్రతీ ఒక్కరి బాధ్యత.

Read Here>>> చేపల కోసం వలవేసి బుడతడికి కరెన్సీ నోట్ల కట్టలే కట్టలు పడ్డాయి!!