Ratnesh Sada : ఒకప్పుడు ఆటో డ్రైవర్.. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.. మంత్రి అయ్యే అవకాశం.. రత్నేష్ సదా ఇంట్రెస్టింగ్ లైఫ్ స్టోరి
రత్నేష్ సదా.. ఒకప్పుడు కుటుంబ పరిస్థితుల రీత్యా ఆటో నడిపేవారట. తరువాత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. బీహార్ సీఎం నీతీశ్ కుమార్కి అత్యంత సన్నిహితులుగా చెప్పబడే రత్నేష్ సదా మంత్రి వర్గ విస్తరణలో భాగంగా క్యాబినెట్ మంత్రిగా చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
![Ratnesh Sada : ఒకప్పుడు ఆటో డ్రైవర్.. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.. మంత్రి అయ్యే అవకాశం.. రత్నేష్ సదా ఇంట్రెస్టింగ్ లైఫ్ స్టోరి Ratnesh Sada : ఒకప్పుడు ఆటో డ్రైవర్.. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.. మంత్రి అయ్యే అవకాశం.. రత్నేష్ సదా ఇంట్రెస్టింగ్ లైఫ్ స్టోరి](https://10tv.in/wp-content/uploads/2023/06/New-Project-9-3.jpg)
Ratnesh Sada
Ratnesh Sada : ఒకప్పుడు ఆయన ఆటో డ్రైవర్ .. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. క్యాబినెట్ మంత్రి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోన్బర్సా అసెంబ్లీ స్ధానం నుంచి మూడుసార్లు జనతాదళ్-యునైటెడ్ శాసనసభ్యుడుగా ఎన్నికైన రత్నేష్ సదా లైఫ్ స్టోరీ ఆసక్తికరంగా అనిపిస్తుంది.
సోన్బర్సా అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రత్నేష్ సదా దళిత నేత. ఆయన జీవితంలో అనేక కష్టాలను పోరాటాలను చూసారు. రాజకీయాల్లోకి రాకముందు జీవనోపాధి కోసం ఆటో నడిపేవారట. రత్నేష్ సదా మహిషి పోలీస్ స్టేషన్ పరిధిలోని సిమర్ గ్రామ నివాసి. అతని కుటుంబం సోన్బర్సాలోని కహ్రాకుటీలో ఉన్న వార్డు నెం.6 లో నివసిస్తోంది. ఆయన తండ్రి లక్ష్మి కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేసేవారట. ఎన్నికల కమిషన్లో దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం రత్నేష్ సదా గ్రాడ్యుయేట్. ఆయనకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.
1987 లో రాజకీయ జీవితం ప్రారంభించిన రత్నేష్ సదా 2010 లో JDU కోటా నుంచి సోన్బర్సా రిజర్వ్డ్ స్ధానం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలా వరుసగా మూడుసార్లు గెలిచారు. ఆయన జేడీయూ మహాదళిత్ సెల్ అధ్యక్షుడు కూడా. జేడీయూ ఉపాధ్యక్షుడిగా ఉంటూ పార్టీలో ఇతర కీలక పదవులు నిర్వహించారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో సోన్బర్సా రిజర్వ్ స్ధానం నుంచి కాంగ్రెస్కు చెందిన తర్ని రిషిదేవ్పై విజయం సాధించారు. ప్రస్తుతం జేడీయూ విప్గా ఉన్న ఆయన బీహార్ సీఎం నితీశ్ కుమార్కు అత్యంత సన్నిహితులని చెబుతారు.
హిందుస్థానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం) చీఫ్ జితన్ రామ్ మాంఝీ కుమారుడు సంతోష్ సుమన్ రాజీనామా చేసిన నేపథ్యంలో సీఎం నితీశ్ కుమార్ రాష్ట్ర మంత్రి వర్గాన్ని విస్తరించే అవకాశం ఉంది. సుమన్ స్థానంలో రత్నేష్ సదా క్యాబినెట్ మంత్రిగా చేరే అవకాశం కనిపిస్తోంది. సదాతో పాటు కాంగ్రెస్, ఆర్జేడీలకు చెందిన మరికొందరు నేతలు కూడా మంత్రులుగా చేరవచ్చు. రాజ్భవన్లో ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేస్తారని తెలుస్తోంది.