మంత్రివర్గ విస్తరణపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
Komatireddy Raj Gopal Reddy: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గ విస్తరణ అధిష్టానం చూసుకుంటుంది. ముఖ్యమంత్రితో చర్చించి అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. కమిట్మెంట్ ఉన్న నాయకులకు మంత్రివర్గ విస్తరణలో చోటు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక పార్లమెంట్ ఎన్నికలు రావడంతో కేబినెట్ విస్తరణ వాయిదా పడిందని ఆయన వ్యాఖ్యానించారు.
కాగా, కేబినెట్ విస్తరణలో రాజగోపాల్ రెడ్డికి చోటు దక్కే అవకాశముందని గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మంత్రివర్గ విస్తరణతో పాటు పీసీసీ నూతన అధ్యక్షుడి ఎంపికను కాంగ్రెస్ అధిష్టానం వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
తొలి ఏకాదశి సందర్భంగా బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దేవులమ్మ నాగారంలో 13వ శతాబ్దపు ఆది మహావిష్ణువు ఆలయానికి రాజగోపాల్ రెడ్డి విచ్చేశారు. తన సతీమణితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలోనే మొట్టమొదటి శ్రీ మహావిష్ణువు ఆలయాన్ని తొలి ఏకాదశి పర్వదినాన దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరించడానికి అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ ప్రాంత ప్రజలు అందరూ సుఖసంతోషాలతో ఉండాలని దేవుడిని ప్రార్థించినట్టు చెప్పారు.
Also Read : పార్టీ మార్పుపై పెదవి విప్పని బీఆర్ఎస్ సీనియర్ నేత.. ఎందుకీ మౌనం, కారణమేంటి?