రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక ప్రకటన

రూ.7వేల కోట్లు రైతుల ఖాతాల్లోకి వెళ్తాయన్నారు. ఆగస్టు పూర్తయ్యేలోగా 3 విడతల్లో రుణమాఫీ పూర్తి అవుతుందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.

రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక ప్రకటన

Cm Revanth Reddy : రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక ప్రకటన చేశారు. మొత్తం మూడు విడతల్లో రుణమాఫీ చేస్తామన్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు లక్ష రూపాయల వరకు ఉన్న రైతు రుణాలకు నిధులు విడుదల చేస్తామన్నారు. రూ.7వేల కోట్లు రైతుల ఖాతాల్లోకి వెళ్తాయన్నారు. ఈ నెలాఖరులోగా లక్షన్నర రూపాయల వరకు, ఆగస్టులో 2లక్షల రూపాయల వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తామన్నారు. ఆగస్టు పూర్తయ్యేలోగా 3 విడతల్లో రుణమాఫీ పూర్తి అవుతుందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్ ఈ ప్రకటన చేశారు.

పదేళ్లు అధికారంలో ఉన్నా రుణమాఫీ చేయలేకపోయారు..
ప్రజాభవన్ లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కాంగ్రెస్ నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. రైతు రుణమాఫీ సహా పలు అంశాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 2022 మే 6న వరంగల్ డిక్లరేషన్ ద్వారా రాహుల్ గాంధీ రైతులకు రూ.2లక్షలు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చారని రేవంత్ గుర్తు చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి కూడా కేసీర్ రూ.28వేల కోట్లు కూడా రైతు రుణమాఫీ చేయలేకపోయారని చెప్పారు. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో చెప్పామన్నారు.

గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలాశాసనం..
ఆర్ధిక నిపుణులు కూడా రుణమాఫీ కష్టమని చెప్పారు, ప్రభుత్వానికి ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారని గుర్తు చేశారు ముఖ్యమంత్రి రేవంత్. ఇచ్చిన మాటకు కట్టుబడి ఆనాడు సోనియమ్మ తెలంగాణ ఇచ్చారని, పార్టీకి నష్టమని తెలిసినా సోనియా గాంధీ ఆనాడు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని రేవంత్ అన్నారు. గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలాశాసనం అని తేల్చి చెప్పారు.

3 విడతల్లో రుణమాఫీ..
”రైతు రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారు. రాహుల్ గాంధీ మాట ఇచ్చారంటే అది చేసి తీరతారన్న నమ్మకం కలిగించడం మన బాధ్యత.
ఈ దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలవాలి. వ్యవసాయ విధానంలో తెలంగాణ మోడల్ ను దేశం అనుసరించేలా ఉండాలి. నా జీవితంలో ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. రేపు సాయంత్రం 4గంటలకు రూ.లక్ష వరకు ఉన్న రైతురుణాలు మాఫీ చేస్తున్నాం. రూ.7వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి వెళతాయి. నెలాఖరులోగా రూ.లక్షన్నర వరకు ఉన్న రైతురుణాలు మాఫీ చేస్తాం. ఆగస్టులో రూ.2లక్షల వరకు రైతుల రుణమాఫీ చేసి రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తాం.

ప్రతీ రైతును రుణ విముక్తుడిని చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. రుణమాఫీ పేరుతో కేసీఆర్ లా మాటలు చెప్పి రైతులను మభ్య పెట్టడం లేదు. రైతు రుణమాఫీపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. అందుకే ఏక మొత్తంలో రూ.2లక్షల రుణమాఫీ పూర్తి చేస్తున్నాం. రైతు ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికే రూ.2లక్షల రైతు రుణమాఫీ.

7 నెలల్లో రూ.30వేల కోట్లు ఖర్చు చేశాం..
మనం చేస్తున్న మంచి పనిని ప్రజలకు వివరించండి. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో కార్యక్రమాలు నిర్వహించండి. రుణమాఫీ హామీని నిలబెట్టుకున్నామని సగర్వంగా చెప్పండి. రుణమాఫీపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఒకే విడతలో రూ.31వేల కోట్లతో రుణమాఫీ చేయలేదు. రాహుల్ గాంధీ ఇచ్చిన గ్యారెంటీని అమలు చేశామని పార్లమెంట్ లో ఎంపీలు ప్రస్తావించాలి. రేపు గ్రామాల్లో, మండల కేంద్రాల్లో కూడలి నుంచి రైతు వేదికల వరకు బైక్ ర్యాలీలు నిర్వహించాలి. ఎమ్మెల్యేలు నియోజకవర్గ కేంద్రాల్లో కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఎక్కడికక్కడ ఒక పండగ వాతావరణంలో సంబరాలు జరపాలి. ఏడు నెలల్లో మన ప్రభుత్వం సంక్షేమానికి రూ.30వేల కోట్లు ఖర్చు చేసింది” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read : ఎన్నడూ లేని విధంగా మంత్రులు, ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరియస్..! ముఖ్యమంత్రిలో మార్పునకు కారణమేంటి?