నవ్యాంధ్ర క్యాపిటల్ అమరావతి పనులు రయ్ రయ్.. రాజధాని నిర్మాణానికి ఎన్ని రోజులు పడుతుంది?

నవ్యాంధ్ర క్యాపిటల్ అమరావతి పనులు రయ్ రయ్.. రాజధాని నిర్మాణానికి ఎన్ని రోజులు పడుతుంది?

How central funds help to Andhra Pradesh capital Amaravati

Andhra Pradesh capital Amaravati: పదేళ్ల నిరీక్షణకు ఫలితం దక్కింది. నవ్యాంధ్రను నిలబెట్టాలనే ఆశకు అవకాశం లభించింది. ఎంతోకాలం వేచి చూసిన తరుణం రానే వచ్చింది. నవ్యాంధ్ర రాజధాని నిధులు సాధించుకుంది. మొదటి ఐదేళ్లు నిధుల కొరతతో ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా ఉన్న అమరావతి భవిష్యత్.. తర్వాత ఐదేళ్ల పాటు మూలకుపడ్డ పనులతో ప్రజలకు భరోసా లేకుండాపోయింది. ఇప్పుడు మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. అమరావతి పనులు పరుగులు పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. బడ్జెట్‌లో కేంద్రప్రభుత్వం ప్రకటించిన 15వేల కోట్ల సాయంతో.. నవ్యాంధ్రకు క్యాపిటల్ వర్క్స్ మళ్లీ ట్రాక్ ఎక్కనున్నాయి.

ఈ ఆర్థిక సంవత్సరంలోనే రూ.15 వేల కోట్ల ఆర్థికసాయం అందిస్తామని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించడంతో అమరావతి నిర్మాణం ఇక దూసుకెళ్లనుంది. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ముళ్ల చెట్లు, నీళ్లల్లో మునిగిన కట్టడాలతో బోసిపోయిన రాజధాని ప్రాంతం మళ్లీ కొత్త రూపం దాల్చుకుంటోంది. వనరుల కొరతే పెద్ద సమస్యగా ఉన్న పరిస్థితుల్లో కేంద్రం చేసిన ప్రకటనతో ఊరట దక్కింది. మరో నాలుగైదు నెలల్లోనే రాజధాని పనులు పూర్తిస్థాయిలో ప్రారంభించనుంది ఏపీ సర్కార్.

రాజధాని నిర్మాణానికి ప్రపంచబ్యాంకు వంటి ఆర్థిక సంస్థల నుంచి ఒక్క ఏడాదిలోనే రూ.15వేల కోట్ల సాయం అందిస్తామని.. అవసరాన్ని బట్టి ఇతర సంస్థల నుంచి మరిన్ని నిధులు ఇస్తామని కేంద్రం బడ్జెట్‌లో హామీ ఇచ్చింది. ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన స్పందించాల్సిన బాధ్యత రాష్ట్ర యంత్రాంగంపై ఉంది. కేంద్ర ప్రభుత్వంతో పాటు వివిధ బ్యాంకులతోనూ సంప్రదింపులు జరిపి, నిధులు తెచ్చుకుని త్వరగా రాజధాని పనులు మొదలుపెడితే.. మరో ఏడాదిలోనే అమరావతికి ఒక రూపం రానుంది. కేంద్రాన్ని ఒప్పించి మరిన్ని నిధులు తెచ్చుకోగలిగితే ఆంధ్రులకు అద్భుతమైన కలల రాజధాని సాకారమవుతుంది.

కేంద్ర నిధులతో పనులు స్పీడప్
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అమరావతి నిర్మాణంపై దృష్టి పెట్టింది. సీఎం చంద్రబాబు అమరావతిలో పర్యటించి.. పెండింగ్‌లో ఉండిపోయిన పనులను పరిశీలించారు. గత ఐదేళ్లలో అడవిలా మారిపోయి.. రోడ్లు, కాలువలు, రైతులకు ఇచ్చిన స్థలాలు ఎక్కడున్నాయో తెలియని దుస్థితిలో ఉన్న రాజధానిలో ఇప్పటికే కొన్ని పనులు ప్రారంభమయ్యాయి. రాజధాని ఏరియాలో కంప చెట్లను తొలగించేందుకే రూ.36 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసి టెండర్లు పిలిచారు. మధ్యలో నిలిచిపోయిన రోడ్లు, ఇతర ప్రధాన మౌలిక వసతులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అఖిల భారత సర్వీసు అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల నివాస భవనాల నిర్మాణం పూర్తి చేసేందుకు అవసరమైన నిధుల కోసం ప్రణాళిక రెడీ చేస్తోంది ఏపీ సర్కార్. ఈ దశలో కేంద్రప్రభుత్వం రూ.15 వేల కోట్లు ఇస్తామని ప్రకటించడంతో రాజధాని నిర్మాణ పనులను స్పీడప్‌ చేసేందుకు ఓ మార్గం దొరికింది.

రాజధానిలో ప్రధాన మౌలిక సౌకర్యాలు, రైతులకు స్థలాలిచ్చిన ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లేఅవుట్‌లో మౌలిక వసతుల కల్పనకు రూ.50 వేల కోట్లకు పైగా ఖర్చు అవుతుందని 2019కి ముందు అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం అంచనాలు రూపొందించింది. రూ.41 వేల కోట్లకు టెండర్లు పిలిచింది. రూ.5 వేల కోట్లకుపైగా నిధులతో కొన్ని పనులు చేపట్టింది. గతంలో చేసిన పనులకు కాంట్రాక్టర్లకు రూ.1,300 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. అప్పట్లో రాజధాని ఏరియాలో పనులు చేపట్టేందుకు రూ.41 వేల కోట్లతో పనులు మొదలుపెట్టినా ఇప్పుడు వాటి ఖర్చు భారీగా పెరగనుంది. దీంతో అంచనాలు పెంచి మళ్లీటెండర్లు పిలవాల్సిన అవసరం ఉంది.

Also Read : వాళ్లతో పొత్తుకోసమే.. ఢిల్లీలో జగన్ ధర్నాపై పయ్యావుల కీలక వ్యాఖ్యలు..

రాజధానిలో నిలిచిపోయిన పనులన్నీ త్వరలోనే మొదలయ్యే అవకాశం ఉంది. అమరావతిలో ముళ్లచెట్లన్నీ తొలగించేందుకు ఇప్పటికే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ముళ్ల చెట్లను తీసేసేందుకే రెండు నెలలు పట్టనుంది. నిలిచిపోయిన పనులకు మళ్లీ DPRలు, అంచనాలు రెడీ చేసేందుకు 4 నెలల సమయం పడుతుందని మున్సిపల్ శాఖ చెబుతోంది. ఇలా మరో నాలుగైదు నెలల్లో మళ్లీ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. అప్పటిలోగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు అందుబాటులోకి వస్తే ఏడాది చివరి వరకే పనులు ట్రాక్ ఎక్కే అవకాశం కనిపిస్తోంది.

రివైజ్డ్ ఎస్టిమేషన్స్‌తో టెండర్లు
ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రాజధానిలో మెయిన్ రోడ్లు, బ్రిడ్జిలు, వరదనీరు, మురుగు నీటి సిస్టమ్, కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్, ఫుట్‌పాత్‌లు, సైకిల్‌ ట్రాక్‌ల అభివృద్ధి, కృష్ణానదిపై ఐకానిక్‌ బ్రిడ్జి నిర్మాణం, విద్యుత్‌ సదుపాయాలు, నీటిసరఫరా వంటి మౌలిక వసతులకు రూ.17వేల కోట్లు ఖర్చవుతుందని అప్పట్లో అంచనా వేశారు. వాటిలో దాదాపు రూ.3,500 కోట్లతో కొన్ని పనులు చేశారు. మిగతా పనులు అన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి. వాటిని దశల వారీగా ఒకదాని తర్వాత మరొకటి అవసరాలను.. ఉపయోగాలను బట్టి చేసుకుంటూ పోవాలని ఫిక్స్ అయింది ఏపీ సర్కార్. మళ్లీ రివైజ్డ్ ఎస్టిమేషన్స్‌తో టెండర్లు పిలిచి పనులు స్టార్ట్ చేయనున్నారు.

ప్రైవేటు సంస్థల నిర్మాణాలు కూడా..
రాజధాని ఏరియాలో హైకోర్టు, సెక్రటేరియట్, వివిద శాఖల కార్యాలయాల టవర్లు, న్యాయమూర్తులు, మంత్రుల నివాస భవనాలు, ఎమ్మెల్యేలు, అధికారుల నివాస భవనాల టవర్ల నిర్మాణానికి రూ.8 వేల 7వందల కోట్లు ఖర్చవుతుందని అంచనా. వాటిలో రూ.15 వందల కోట్లతో కొన్ని పనులు పూర్తయ్యాయి. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద వేసిన లేఅవుట్లలో మౌలిక వసతుల ఏర్పాటుకు మరో రూ.20 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని లెక్కలు వేశారు. ఆ అంచనాలన్నీ ఇప్పుడు పెరుగుతాయి. కేంద్ర ప్రభుత్వం సమకూర్చే నిధులతో రాజధానిలోని ప్రధాన మౌలిక వసతుల పనుల్ని, భవనాల్ని దాదాపుగా ఒక కొలిక్కి తేవచ్చు. రోడ్లు, కరెంట్, కమ్యూనికేషన్ వంటి వసతుల నిర్మాణం పూర్తయితే.. రాజధానిలో ఏరియాలో భూములు తీసుకున్న ప్రైవేటు సంస్థలు కూడా నిర్మాణాలు చేపట్టేందుకు ముందుకు వస్తాయి.

Also Read : రుషికొండ ప్యాలెస్‌పై అసెంబ్లీలో చర్చ వెనుక సీఎం చంద్రబాబు భారీ స్కెచ్..!

అంతర్జాతీయ బ్యాంకుల నుంచి రుణం
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించిన ఆర్థికసాయాన్ని వివిధ అంతర్జాతీయ బ్యాంకుల నుంచి రుణంగా ఇప్పిస్తామని చెప్పింది. అది రుణమైనా రాష్ట్రానికి భారం కాదంటున్నారు ఎక్స్‌పర్ట్స్. ప్రపంచబ్యాంకు వంటి సంస్థలు ఇచ్చే రుణంపై వడ్డీ నామమాత్రంగా ఉంటుంది. లోన్ చెల్లించేందుకు ఇచ్చే గడువు కూడా ఎక్కువగా ఉంటుంది. సీఎం చంద్రబాబు చెప్పినట్లు కేంద్రప్రభుత్వం ఆ నిధుల్ని అప్పు రూపంలో ఇస్తున్నా.. వాటిని తీర్చాల్సింది 30 ఏళ్ల తర్వాతే. కాబట్టి ఇప్పటికిప్పుడు కేంద్రం ఇచ్చే 15వేల కోట్లు కట్టాలన్న ఇబ్బందేమి లేదు. ఆ లోన్లకు హామీ కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే రుణం కూడా FRBM పరిధిలోకి రాదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు.