పావురం ఎగరలేదని ఎస్పీ సీరియస్.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ క‌లెక్ట‌ర్‌కు లేఖ

పంద్రాగస్టు వేడుకలతోపాటు, వివిధ కార్యక్రమాల్లో శాంతి, స్వేచ్ఛకు చిహ్నంగా పావురాలను ఎగురవేయడం భారత్ లో ఆనవాయితీ..

పావురం ఎగరలేదని ఎస్పీ సీరియస్.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ క‌లెక్ట‌ర్‌కు లేఖ

District police chief Girija Shankar Jaiswal

Chhattisgarh : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. తాను వదిలిన పావురం ఎగరలేదని, ఎగరలేని పావురాన్ని తీసుకొచ్చిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ కు లేఖ రాశారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పంద్రాగస్టు వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోనూ వాడవాడల పంద్రాగస్టు వేడుకలను నిర్వహించారు. ఛత్తీస్‌గఢ్ ముంగేళి జిల్లాలో జరిగిన పంద్రాగస్టు వేడుకలకు బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పన్నాలాల్ మోహ్లే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ రాహుల్ దేవ్, ఎస్పీ గిరిజా శంకర్ జైస్వాల్ కూడా పాల్గొన్నారు.

Also Read : బీడీ కాల్చి అగ్గిపుల్ల రోడ్డుపై వేసిన వ్యక్తి.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం..

పంద్రాగస్టు వేడుకలతోపాటు, వివిధ కార్యక్రమాల్లో శాంతి, స్వేచ్ఛకు చిహ్నంగా పావురాలను ఎగురవేయడం భారత్ లో ఆనవాయితీ. అదే ఆనవాయితీని కొనసాగిస్తూ పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీలు పావురాలను ఎగరవేశారు. ముగ్గురూ ఒకేసారి పావురాలను ఎగురవేయగా.. బీజేపీ ఎమ్మెల్యే పన్నూలాల్, కలెక్టర్ రాహుల్ దేవ్ ఎగురవేసిన పావురాలు పైకి ఎగురుకుంటూ వెళ్లాయి. ఎస్పీ గిరిజా శంకర్ ఎగురవేసిన పావురం ఎగురకుండా కిందకూలిపోయింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. పలువురు నెటిజన్లు వ్యంగ్యంగా కామెంట్లు చేశారు. పాపులర్ వెబ్ సిరీస్ పంచాయత్ -3 సీజన్ లో ఇదే సన్నివేశం ఉందంటూ పలువురు నెటిజన్లు ప్రస్తావించారు.

Also Read : శ్రీశైలంలో భారీ వర్షం.. విరిగిపడిన కొండ చరియలు.. తప్పిన పెను ప్రమాదం

సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావటంతో ఘటనపై ఎస్పీ గిరిజా శంకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అనారోగ్యంతో ఉన్న పావురాన్ని తీసుకురావడం వల్లే ఇలా జరిగిందని, వెంటనే బాధ్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కు లేఖ రాశారు. అయితే, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో పావురం ఎందుకు ఎగరలేదని ఎస్పీ నిర్వాహకులను ప్రశ్నించడం కనిపించింది.. వెంటనే మరో పావురాన్ని తీసుకొచ్చి ఎగురవేశారు. మొత్తానికి ప్రస్తుతం ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.